గడిచిన నాలుగున్నరేళ్లుగా బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి పదవి అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగుతూ వస్తుంది. ఈ బటన్ నొక్కడానికే వైసీపీ పార్టీకి ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారా..? లేక ఈ బటన్ నొక్కడానికే జగన్ వందల మంది ప్రభుత్వ సలహాదారులను నియమించారా..? అనేది ప్రతిపక్షాలతో పాటు ప్రజలకు అర్థంకాని ప్రశ్నే.
గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు అన్నట్టుగా జగన్ వ్యవహారశైలి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి, రాష్ట్ర సంపదను తన ఓటు బ్యాంకు రాజకీయం కోసం వినియోగిస్తూ రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం బటన్ మాత్రమే నొక్కుతాను అంటూ ముందుకెళ్తున్న జగన్ కు జనసేన తరుపున నాగబాబు ఒక పిట్ట కథతో కౌంటర్ వేశారు.
ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో చేరి అక్కడ కాకిపిట్ లో ఉన్న విమానం నడపడం ఎలా అనే పుస్తకాన్ని చూసాడు. అందులో మొదటి పేజీ లో ‘విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి’ అని ఉంది. ఆ వ్యక్తి ఆ ‘ఆకుపచ్చ బటన్’ నొక్కి రెండవ పేజీ తెరిచి చూస్తే.., అందులో విమానం కదలాలంటే పచ్చ బటన్ నొక్కండి అని ఉంది.
సదరు వ్యక్తి ఆ ‘పచ్చ బటన్’ నొక్కి తిరిగి మూడవ పేజీని తెరిచి చూసాడు. అందులో విమానం వేగం అందుకోవాలంటే ‘నీలం బటన్’ నొక్కండి అని ఉంది. అతడు ఆ నీలం బటన్ నొక్కి మరింత ఆసక్తిగా నాలుగవ పేజీ తెరిచి చూసాడు. అందులో విమానం గాలిలోకి ఎగరాలంటే ‘ఆరెంజ్ బటన్’ నొక్కండి అని ఉంటే దానిని కూడా నొక్కాడు. అయితే విమానం యమా వేగంగా గాలిలోకి లేచింది.
దీనితో మరింత ఆతృతగా ఇదో పేజీ తిప్పాడు. విమానం కిందకు దిగాలంటే ఈ పుస్తకం 2 వ ‘వాల్యూమ్’ కొనండి అని ఉంది. ఈ పిట్టకథలో నీటి ఏమిటంటే…విమానం అయినా… అధికారం అయినా..ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే …సర్వ నాశనం కాక తప్పదు.
“నడపడం అంటే బటన్ నొక్కడం కాదు…సమర్థత అనుభవం కూడా ఉండాలి”. అంటూ నాగబాబు ఈ పిట్టకథను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఒక్క బటన్ నొక్కడం కోసం వేలమంది వాలంటీర్లు, వందల మంది సలహాదారులు, 175 కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లు, కొన్ని పత్రికలు, బ్లూ మీడియా ఛానళ్లు, ప్రతిపక్షాలు మీద దాడులు ఇవన్నీ అవసరమా…? జగన్ కు వచ్చిన ఒక్క ఛాన్స్ అవకాశాన్ని బటన్ నొక్కడానికే పరిమితం చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారు అనేది నాగబాబు ఆలోచనగా కనపడుతుంది.
వీటన్నింటి వలన రాష్ట్రానికి మిగిలింది లక్షల కోట్ల అప్పు…అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు…,గుంతలతో నిండిన రోడ్లు..,రాజధాని కూడా నిర్మించుకోలేని దీనస్థితి.., అటకెక్కిన ప్రాజెక్టులు.., ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని హీన స్థితి….కలిసి రాష్ట్రానికి భవిష్యత్ పేజీలు లేకుండా చేస్తున్నాయి. పాలన అంటే బటన్ నొక్కడం కాదు పేజీలు తిప్పడం కాదు. సలహాదారులను పెట్టుకుని బటన్లు నొక్కుతూ చేసే పాలన పుస్తకాన్నిపెట్టుకుని విమానం నడిపినట్టే అనేది ఈ పిట్టకథతో ఒక క్లారిటీ ఇచ్చారు నాగబాబు.




