వైసీపీ 2.0 కోసం జగన్ చేస్తున్న రాజకీయం భవిష్యత్ లో ప్రజామోదం పొందుతుందా.? ఆ పార్టీ అధినేత గా జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ప్రజల మద్దతు దక్కుతుందా.?
రాష్ట్ర రాజధాని పై మూడు ముక్కాలాటా నుంచి విశాఖే రాజధాని అంటూ మాట మార్చిన జగన్ చివరికి విశాఖ నుంచి మావిగన్ కు షిఫ్ట్ కొట్టారు. అయితే జగన్ చేస్తున్న మావిగన్ ప్రకటనలు రాష్ట్రంలో వైసీపీ ని రాజకీయంగా సమర్దిస్తాయా.?
ఇక లిక్కర్ స్కాం నుంచి తిరుమల లడ్డు కల్తీ వరకు వైసీపీ ఎదుర్కుంటున్న కేసులు, ఆరోపణలను ప్రజలు మరిచిపోయే అవకాశం ఉంటుందా.? పారిశ్రామిక వేత్తలకు వైసీపీ నుంచి వస్తున్న బెదిరింపులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి జగన్ చేస్తున్న హెచ్చరికలను ప్రజలు స్వాగతిస్తున్నారా.?
వైసీపీ శ్రేణులు చేస్తున్న రప్ప రప్ప నినాదాలు, వాటికీ జగన్ నుంచి వస్తున్న ప్రోత్సాహకాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయా.? ఈ ప్రశ్నలన్నింటికీ వైసీపీ జవాబు వెతుక్కోవాలి. లేకుంటే 2024 ఎన్నికల ముందు ఇచ్చిన వై నాట్ 175 నినాదం మాదిరి వైసీపీ 2.0 నినాదం కూడా పాతాళానికి పడుతుందని వైసీపీ గ్రహించాలి.
నాడు జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల బూతు రాజకీయాలను ప్రజలను ఆదరిస్తున్నారని భావించిన వైసీపీ చివరికి రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇక బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయింది అనుకుంటే రాష్ట్ర ప్రజలు వైసీపీ పనిపెట్టారు.
అలాగే పవన్ అరెస్టు తో జనసేనను నిర్బంధించేసాం అనుకున్న జగన్ కు 100 % స్ట్రైక్ రేట్ తో ప్రజలు జనసేన కు మద్దతు తెలిపారు. ఇలా జగన్ ఒకటి తలిస్తే అందుకు ప్రజల నుంచి ఫలితం మరోలా వస్తుంది. ఇక ఇప్పటికైనా జగన్ తన పార్టీ శ్రేణులను ఊహాలోకంలో ఉంచకుండా, భ్రమల్లో బతకనీయకుండా వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళ్ళేలా చెయ్యాలి.
ప్రజలు మౌనంగా ఉన్నారనే, ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తుందో అని వైసీపీ ఇప్పటికి కింద పడ్డా తనదే పై చేయి అని భావిస్తే అది వైసీపీ అజ్ఞానమే అవుతుంది. ప్రజల మద్దతు పొందాలి అంటే కేవలం బటన్లు నొక్కడం మాత్రమే సరిపోదని అంతకు మించి చేయాలనీ వైసీపీ ఇప్పటికి గ్రహించలేకపోతుంది.
అలాగే ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బకొట్టాలని అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యాలని అనే పైశాచిక రాజకీయ క్రీడ నుంచి వైసీపీ ఈనాటికి బయటకు రాలేకపోతుంది. నిన్నటి వైసీపీ ఓటమిని ఈవీఎం ల మీద నెట్టిన జగన్ ఒకవేళ రేపటి రోజున తానూ ఆశించినట్టుగానే వైసీపీ 2.0 అధికారంలోకి వస్తే దాని తాలూకా ఫలితం కూడా ఈవీఎం ల పుణ్యమే అని ఒప్పుకోగలరా.?
రాజకీయాలలో గెలుపుని ఆస్వాదించడం కంటే కూడా ఓటమిని స్వీకరించడం నేర్చుకోవాలి. పవన్ సినీ రంగంలో సూపర్ స్టార్ డం ఉంచుకుని కూడా 2019 ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి తన ఓటమి ని, తన పార్టీ పరాజయాన్ని అంగీకరించారు, అలాగే వైసీపీ గెలుపుని స్వాగతించారు.
కానీ నేటికీ జగన్ నుంచి ఆ పార్టీ క్యాడర్ వరకు కూటమి గెలుపుని జీర్ణించుకోలేకపోతోంది అలాగే వైసీపీ ఓటమిని ఒప్పుకోలేకపోతుంది వై.? వైసీపీ అధికారం కోసం ఎం చెయ్యాలో ఆలోచిస్తున్న జగన్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తెలుసుకోలేకపోతున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రల ప్రకటనలు, ప్రెస్ మీట్ల ప్రసంగాలు పార్టీ రాజకీయ లబ్ది కోసమే కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం కాదా.? అనే ప్రశ్నను మిగులుస్తున్నారు.





