అదేమి చిత్రమో కానీ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పైనున్న దేవుడినే నమ్ముకున్నా ఆ పైవాడు ఆయనకు వరుసపెట్టి షాకులే ఇస్తున్నాడు. జగన్ భయపడుతున్నట్లే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. జగన్ భయపడుతున్నట్లే తాను సంధించి పక్కన పడేసిన వైఎస్ షర్మిల బాణం అటు తిరిగీ ఇటు తిరిగీ ఇప్పుడు ఏపీకి వచ్చేస్తోంది.
ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతకం చేసిన ఆ ప్రెస్నోట్ని కొద్ది సేపటి క్రితమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంతకాలం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఆమె కోసమే నిన్న తన పదవికి రాజీనామా చేశారు. కనుక ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా నియమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
వైఎస్ షర్మిల రాకతో ఎక్కువగా నష్టపోయేది ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి… వైసీపియే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయినప్పుడు కాంగ్రెస్లో చాలా మంది నేతలు, పార్టీ క్యాడర్ వైసీపిలోకి వెళ్ళిపోయారు. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా వైసీపి వైపు వెళ్ళిపోయింది.
ఇప్పుడు వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల ముందుకు వస్తోంది కనుక వైసీపిలో నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలవడం ఖాయమే. ముఖ్యంగా జగన్ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసినవారు, వైసీపిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి మారిపోవచ్చు.
ఇంతకాలం ‘వైసీపి వ్యతిరేక ఓటు బ్యాంకు’ని టిడిపి, జనసేనలు చీలకుండా కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చి ‘వైసీపి అనుకూల ఓటు బ్యాంకు’ని చీల్చబోతున్నారు. అంటే వైసీపికి రెండు వైపులా నష్టం తప్పదన్నమాట!
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కనుక ఈవారం లోగానే ఆమె విజయవాడకు వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అదే రోజు నుంచి అన్న జగన్మోహన్ రెడ్డిపై, వైసీపి ప్రభుత్వంపై ఆమె బాణాలు సందించడం కూడా ఖాయమే.
ఇంతకాలం టిడిపి, జనసేనలు విమర్శలను జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు చాలా తేలికగా కొట్టిపడేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేయబోయే విమర్శలు, ఆరోపణలకు ఏమని సమాధానాలు చెప్పుకుంటారో?ఆమెను ఏవిదంగా ఎదుర్కొంటారో చూడలి.
ఏపీలో అన్నా చెల్లెళ్ళ మద్య జరుగబోయే ఈ రాజకీయ మ్యాచ్లో వారి తల్లి విజయంమ్మ ఎటువైపు ఉంటారో చూడాలి. తాను కూతురు షర్మిలకు అండగా ఉంటానని చెప్పి గత ఏడాది ఆమె వైసీపిని వీడి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు కూడా ఆమె కూతురు వైపే ఉంటారా?లేక కొడుకు వైపు మారిపోతారా?లేక ఎంపైరింగ్ చేస్తూ మెల్లగా ఇద్దరికీ రాజీ కుదుర్చుతారా?చూడాలి. ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆనందించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సొంత ఇంట్లోనే ఈ చిచ్చు అంటుకోవడం దేవుడి స్క్రిప్టే అనుకోవాలి. మరి ఈ మంటలను ఎలా ఆర్పుకుంటారో? ఏది ఏమైనప్పటికీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఇద్దరే కనుక వారి యుద్ధాలను చూసేందుకు రెండు కళ్ళూ చాలవు.




