వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే వైసీపి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలవుతాయని అనుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీపై ఇంకా ఎవరికీ నమ్మకం కుదిరిన్నట్లు లేదు. అందుకే వైసీపి నుంచి ఒక్క పెద్ద నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.
కానీ దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. ఏపీలో పదేళ్ళు కనబడకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ని, ఇప్పుడు వైఎస్ షర్మిలని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం తొందరపాటే అవుతుందనే ఆలోచన, ఈసారి ఎన్నికలలో వైసీపి-టిడిపి, జనసేన, బీజేపీ కూటమి మద్యే పోరు జరుగబోతుండటం, ఆ పోరులో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా దక్కవనే దూరదృష్టితోనే వైసీపి నుంచి పెద్ద నేతలు ఎవరూ కాంగ్రెస్లో చేరలేదని భావించవచ్చు.
కానీ వైసీపిలో టికెట్స్ రాని నేతలు ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా పి.గన్నవరం వైసీపి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొన్ని రోజుల క్రితమే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తొరుగు, చింతలపూడి ఎమ్మెల్యే విఆర్.ఎలిజా వైసీపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ షర్మిల కడప నుంచి లోక్సభకు పోటీ చేయబోతుండటం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా వైసీపి నేతలకు బలమైన సంకేతమే ఇచ్చారని చెప్పవచ్చు. ఆమె జగన్, అవినాష్ రెడ్డిలను నిర్ధాక్షిణ్యంగా చీల్చి చెండాడేస్తూ, అన్నకు వ్యతిరేకంగా పోరాడుతారనే నమ్మకం వైసీపి నేతలలో కలుగుతున్నట్లుంది. అందుకే వైసీపి నుంచి వలసలు మొదలయ్యాయనుకోవచ్చు.
కడపలో దూసుకుపోతున్న వైఎస్ షర్మిల ఈరోజు మరో కొత్త విషయం చెప్పారు. వివేకా హత్య గురించి తాను, సునీతా రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేక బెంబేలు ఎత్తుతున్న జగన్, కడపలో అవినాష్ రెడ్డిని మార్చి వేరే అభ్యర్ధిని నిలబెట్టబోతున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు. కానీ కడపలో స్వయంగా జగన్మోహన్ రెడ్డే తనపై పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని వైఎస్ షర్మిల అన్నారు.
వైసీపి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి క్యూ కడుతుండటం, ఇప్పుడు షర్మిల చెప్పిన్నట్లు అవినాష్ రెడ్డిని మార్చబోతుండటం నిజమే అయితే వైసీపిపై వైఎస్ షర్మిల ఎఫెక్ట్ మొదలైందనే భావించవచ్చు.
కానీ అసలు కధ ఎన్నికల తర్వాత మొదలవుతుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ 5-10 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగలిగినా, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతున్నట్లే, ఎన్నికల తర్వాత వైసీపి కూడా ఖాళీ అయిపోవడం ఖాయమే అని భావించవచ్చు.
ఎందుకంటే, రాష్ట్రంలో టిడిపి, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే, అవి జగన్, వైసీపిలో పలువురు నేతలపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం ఖాయం. కానీ వారందరికీ టిడిపి, జనసేన, బీజేపీ తలుపులు తెరుచుకోవు. కనుక తలుపులు తెరిచి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఆత్మరక్షణ చేసుకోవడం ఖాయమే. అందుకే జగన్ కూడా ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి చొక్కా మడత పెట్టి పోరాడుతున్నారు.






