శనివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, ఆమె ఇద్దరు పిల్లలు ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. తర్వాత వైఎస్ షర్మిల హైదరాబాద్ తిరిగివచ్చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సిఎం జగన్మోహన్ రెడ్డి తన అర్దాంగి భారతీ రెడ్డితో కలిసి వచ్చి తండ్రికి నివాళులు అర్పించారు. కొడుకుతో కలిసి విజయమ్మ మరోసారి భర్తకు నివాళులు అర్పించారు. తొలిసారిగా సిఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఒకరికొకరు ఎదురుపడకుండా వేర్వేరు సమయాలలో తండ్రికి నివాళులు అర్పించి వెళ్ళారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ అటువంటిదేమీ చేయకలేదు. కానీ వైఎస్ జయంతి పురస్కరించుకొని రాహుల్ గాంధీ నివాళులు ఆర్పిస్తూ ట్వీట్ చేయగా, “రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తన తండ్రి భావించేవారని, ఆయనని గుర్తుంచుకొని గౌరవిస్తున్నందుకు కృతజ్ఞతలు,” అంటూ వైఎస్ షర్మిల వెంటనే జవాబు ఇచ్చారు.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్దిస్తూ ట్వీట్ చేయడం ద్వారా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సరైన సందేశమే ఇచ్చిన్నట్లు భావించవచ్చు. అయితే ఆమె తెలంగాణ కాంగ్రెస్లో చేరాలనుకొంటుంటే, ఆమెను ఏపీ కాంగ్రెస్లో చేరాలని సూచిస్తుండటం వలన, కాంగ్రెస్లో చేరిక ఆలస్యమవుతున్నట్లు భావించవచ్చు. అయితే కాంగ్రెస్లో చేరడం ఖాయమే కనుక నేడో రేపో అధికారిక ప్రకటన చేయవచ్చు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా పాలేరులో బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు సమాచారం. కనుక ఆ సభలో ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి, తాను పనిచేసేది ఏపీలోనా లేక తెలంగాణలోనేనా? అనే విషయంపై స్పష్టత ఈయవచ్చు.



