రాజకీయనేతలు వచ్చినప్పుడు వారికి ప్రజలు హారతులు ఇవ్వడం చూస్తుంటాము. కానీ హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం వద్ద తనను గృహ నిర్బందం చేయడానికి వచ్చిన పోలీసులకు వైఎస్ షర్మిల స్వయంగా హారతి ఇవ్వడం విశేషం.
ఈరోజు ఉదయం ఆమె గజ్వేల్ పర్యటనకు బయలుదేరుతుండగా భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెను అడ్డుకొన్నారు. గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని కనుక గృహనిర్బందంలో ఉంచుతున్నామని తెలియజేశారు.
తాను పనీపాటు లేకనో లేదా ఏవో వ్యక్తిగత సమస్యలు ఉన్నందునో రాజకీయాలలోకి రాలేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడేందుకే రాజకీయాలలోకి వచ్చానని అన్నారు.
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా తాను గజ్వేల్ ప్రజలను కలవడానికి వెళుతుంటే ఎందుకు అడ్డుకొని గృహనిర్బందం చేస్తున్నారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. తాను గజ్వేల్ వెళ్ళి అక్కడి ప్రజలతో, విద్యార్థులతో తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడివచ్చేస్తానని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టనని కనుక తనను గజ్వేల్ వెళ్ళేందుకు అనుమతించాలని కోరారు.
కానీ పోలీసులు అంగీకరించకపోవడంతో ఆమె పోలీసులకు హారతి ఇచ్చి , పోలీసుల వైఖరికి నిరసనగా లోటస్ పాండ్ నివాసం వద్దనే సాయంత్రం వరకు నిరాహారదీక్ష చేసేందుకు కూర్చోన్నారు.
వైఎస్ షర్మిల నేడో రేపో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేయబోతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు ఆమెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గతంలో ఆమె అన్న జగన్ కూడా ఇలాగే అందరినీ తన వెంట తిప్పించుకొని రాష్ట్ర విభజన జరుగుతుండగా తమని నడి రోడ్డుపై వదిలేసి ఏపీకి వెళ్లిపోయారని, దాంతో తమ రాజకీయంగా చాలా నష్టపోయామని కొండా సురేఖవంటి వారు ఆరోపిస్తున్నారు. ఇపుడు వైఎస్ షర్మిల కూడా తన అన్నలాగే తమని నడిరోడ్డుపై వదిలేసి తన దారి తాను చూసుకొంటున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీలో నేతలు, కార్యకర్తలు ఆమె వెంట తిరగడం మానేశారు.
వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్లో చేరి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటుంటే, ఆమెకు తెలంగాణ కాంగ్రెస్లో చోటు లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టం చెప్పారు. అలాగని ఆమె ఏపీ కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.
కనుక ఎటువైపు అడుగువేస్తారో ఆమెకే తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నేడు గజ్వేల్ పర్యటనకు బయలుదేరాలనుకోవడం ఊసుపోకనే అనుకోవాలేమో?



