వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అసమర్ధతలను నిలదీసి ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇంతకాలం ఎవరికీ తెలియని రహస్యాలు, కొత్త కొత్త విషయాలు వైఎస్ షర్మిల ఒకటొకటిగా బయటపెడుతుంటే అవి విని ప్రజలు కూడా షాక్ అవుతున్నారు.
తెలుగు టీవీ సీరియల్లాగ ఏళ్ళ తరబడి సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై ఇప్పుడు మీడియా ప్రజలు కూడా ఆసక్తి కోల్పోయారు. కానీ వైఎస్ షర్మిల పుణ్యమాని మళ్ళీ ఆ కేసు విషయాలు మళ్ళీ వినిపిస్తున్నాయి.
శనివారం విశాఖలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆమె మాట్లాడుతూ, “ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చేవరకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఓ అనామకుడు. ఆయన గురించి ఎవరికీ తెలీదు. కానీ జగన్ ముఖ్యమంత్రి కాగానే పొన్నవోలుకి అడ్వకేట్ జనరల్ పదవి కట్టబెట్టారు. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబందించి చార్జిషీట్స్లో మా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా చేర్పించింది ఆ మహానుభావుడే. ఈ కేసులలో జగన్కు బెయిల్ లభించాలంటే వైఎస్ పేరు కూడా చేర్చడం అనివార్యం అని ఆయనే సూచించారు. ఆయనే స్వయంగా వైఎస్ పేరుని సీబీఐ చార్జిషీట్స్లో చేర్చాలని కోరుతూ సీబీఐ కోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేయించారు.
ఎవరైనా తండ్రిని గౌరవించాలనుకుంటారు. కానీ జగన్ మాత్రం మా తండ్రిగారి పేరుని సీబీఐ చార్జిషీట్స్లో చేర్పించారు. దీనికే సిగ్గుతో తలదించుకోవలసి ఉండగా, ఈ పని చేసినందుకు ప్రతిఫలంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ అడ్వకేట్ జనరల్ పదవి కట్టబెట్టడం ఇంకా సిగ్గుచేటు.
జగన్ ముఖ్యమంత్రి చేపట్టిన వారం రోజులలోపే ఆయనకు ఈ పదవిలో నియుక్తులయ్యారు. ఇందుకు ఆయన కూడా ఏమాత్రం సిగ్గుపడకపోగా తిరిగి నన్ను విమర్శిస్తున్నారు కూడా,” అని వైఎస్ షర్మిల అన్నారు.
వివేకా హత్య గురించి వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక కడప కోర్టుని ఆశ్రయించిన వైసీపి, కనీసం ఈ తాజా ఆరోపణలకైనా సమాధానం చెప్పగలదా?




