కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గా ఈ రోజు నామినేషన్ వేసిన వైస్ షర్మిల నామినేషన్ అనంతరం మీడియా తో మాట్లాడి తదుపరి బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తన అన్న వైస్ జగన్ కు, వైకాపా నాయకులకు పలు ప్రశ్నలు సంధించారు.
జగన్ గారికి చిన్న రాయి తగిలితేనే దానిని ముఖ్యమంత్రి పై హత్యాయత్నం అంటూ సాక్షిలో హెడ్ లైన్స్ వేస్తూ చేస్తున్న హడావుడి చూస్తుంటే రాయి తగిలితేనే ఇంతలా రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు మరి వివేకా ను గొడ్డలితో తలమీద 7 సార్లు నరికితే దాన్నేమన్నారు..? గుండెపోటు అంటూ ఎందుకు ప్రచారం చేసారు..? అంటూ వైసీపీ నేతలకు, సాక్షి మీడియాకు, జగన్ మోహన్ రెడ్డి కి సూటి ప్రశ్న వేశారు షర్మిల.
2019 లో గొడ్డలితో ఒకసారి వివేకాను హత్య చేసిన మీరు, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మీ సొంత మీడియాలో పైన వైస్సార్ బొమ్మ వేసి కింద ఆయన తమ్ముడు వివేకా మీద వ్యక్తిగత దాడి చేస్తూ పదేపదే వివేకాను కూని చేస్తూనే వస్తున్నారు. అలా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులకు మరల రాజకీయ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు.
అక్కడితో ఆగకుండా ఆయన మరణానికి న్యాయం కావాలి అంటూ పోరాడుతున్న ఆయన కుమార్తె సునీత మీద నీచమైన విమర్శలు చేస్తూ ట్రోల్ చేసే మీ వైసీపీ సైన్యం చివరికి వైస్ బిడ్డ అనే కనికరం కూడా లేకుండా నన్ను నువ్వు వైస్సార్ బిడ్డవు కాదు అంటూ ప్రచారం చేస్తూ నా తల్లి విజయమ్మను కూడా అవమానిస్తున్నారు.
హత్య రాజకీయాలను ఓడించాడనికి నేను పోరాడుతుంటే…హత్య రాజకీయాలను ప్రోత్సహించడానికి జగన్ తాపత్రయపడుతున్నారు ఇక ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైనే ఉంది అంటూ కడప ప్రజలకు ఓటు విలువ వివరించారు షర్మిల. అలాగే వివేకా హత్య ఉదంతాన్నిఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదు అంటూ కోర్ట్ నిబంధన తెచ్చినప్పటికీ షర్మిల ఆ నింబంధలను బేఖాతరు చేస్తూ జగన్, అవినాష్ రెడ్డిల పై రెచ్చిపోయారు.
కేవలం తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ తన అధికారాన్ని అడ్డేసి వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తన పై జరిగిన చిన్న రాయి దాడిని హత్య యత్నం అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవచ్చు కానీ, గొడ్డలితో నరికి చంపిన కేసు గురించి ప్రజలలో చర్చించకూడదా..?అదెక్కడి న్యాయం..? అంటూ వైసీపీ రాజకీయాలను ఎండగట్టారు. వైసీపీ నేతల ఆరోపణలు చూస్తూనే హత్యకు రాయి…రక్షణకు గొడ్డలి అనే విధంగా ఉన్నాయి అంటూ నోరెళ్లబెడుతున్నారు రాజకీయ మేధావులు.






