కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వదిన భారతిని ఉద్దేశ్యించి, “రాష్ట్రంలో మరెవరూ వైసీపికి పోటీ ఉండకూడదనుకుంటే ప్రత్యర్ధులు అందరినీ గొడ్డలితో నరికేయండి. అప్పుడు మీరు కోరుకుంట్లుగా రాష్ట్రంలో వైసీపి ఒక్కటే ‘సింగిల్ ప్లేయర్’గా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేవారే రాష్ట్రంలో ఉండరు కూడా,” అని వైఎస్ షర్మిల అన్నారు.
సిఎం జగన్ సతీమణి భారతి ఇటీవల కడపలో ఎన్నికల ప్రచారం చేస్తూ కడపలో వైసీపి (అవినాష్ రెడ్డి) సింగిల్ ప్లేయర్ అని, ఆయనకు మరెవరూ పోటీ కారని అన్నారు. కడపలో తాను పోటీలో ఉండగా మరెవరూ పోటీలో లేరన్నట్లు వదినమ్మ భారతి మాట్లాడినందుకు వైఎస్ షర్మిల ఆగ్రహం కలిగిన్నట్లుంది. బహుశః అందుకే అలా అని ఉండవచ్చు.
ఇటీవల చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరూ ముఖ్యం కాదు. తనకు తాను మాత్రమే ముఖ్యమనుకుంటారు. కుటుంబ సభ్యులనే నమ్మని జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఆరాటపడుతున్నారంటే నమ్మశక్యంగా ఉందా?” అని ప్రశ్నించారు.
ఇప్పుడు వైఎస్ షర్మిల మాటలు వింటే చంద్రబాబు నాయుడు చెప్పింది అక్షరాల నిజమని అర్దమవుతుంది. ఆమె అవినాష్ రెడ్డి గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. “ఈసారి ఎన్నికలలో ఓటమి తప్పదని, ఓడిపోతే జైలుకి వెళ్ళక తప్పదని ముందే గ్రహించిన అవినాష్ రెడ్డి అప్పుడే పాస్ పోర్ట్ సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడక మునుపే దేశం వదిలి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు,” అని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడప ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. “ అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచిన్నట్లు. మీరు మీ ఎంపీని కడపలోనే కలవాలనుకుంటే నాకు ఓట్లు వేసి గెలిపించండి. మీరు మీ ఎంపీని కలవడానికి జైలుకి వెళ్ళాలనుకుంటే అవినాష్ రెడ్డికి ఓట్లు వేయండి,” అని వైఎస్ షర్మిల అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఏపీ సిఎం, వైసీపి అధినేత కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిల తన అన్నపై విమర్శలు, ఆరోపణలు చేయడం సహజమే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రత్యక్ష రాజకీయాలలో లేని తన వదినమ్మ భారతిపై ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆలోచింపజేస్తున్నాయి. తన వదినమ్మ భారతే రాష్ట్రంలో వైసీపి రాజకీయాలను భర్త జగన్ ద్వారా నడిపిస్తున్నారని వైఎస్ షర్మిల అభిప్రాయంగా కనిపిస్తోంది.




