వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి అన్నవదిన జగన్మోహన్ రెడ్డి, భారతిలను ఆహ్వానించడానికి వెళితే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటమే వారి అసహనానికి కారణమని వేరే చెప్పక్కరలేదు. అయితే ఇప్పుడు ఆమె వారికి ఇంకా ఆగ్రహం కలిగించబోతున్నారు.
వైఎస్ షర్మిల తన కుమారుడుని వెంటబెట్టుకొని శనివారం ఉదయం 11 గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి శుభలేఖ అందించి పెళ్ళికి ఆహ్వానించబోతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడుని కలువబోతున్నారు. కనుక ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి వారు చర్చించే అవకాశం ఉంది.
ఆ తర్వాత ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వెళ్ళి శుభలేఖ ఇవ్వడం ఖాయమే. ఆ తర్వాత చిరంజీవి తదితర సినీ ప్రముఖులను, సిఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులందరినీ ఆమె ఎలాగూ ఆహ్వానిస్తారు.
నిజానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను కలిసేందుకు వైఎస్ షర్మిలకు కుమారుడి పెళ్ళి చక్కటి అవకాశం కల్పించిందని చెప్పవచ్చు. లేకుంటే వారిని కలిసేందుకు ఆమె సాకులు వెతుక్కోవలసి వచ్చేది. ఇప్పుడు శుభలేఖలు పట్టుకొని జగన్ ప్రత్యర్ధులలో ఎవరిని కలవాలనుకుంటే వారిని నిరభ్యంతరంగా కలిసి రాజకీయ కార్యాచరణ సిద్దం చేసుకొనే వెసులుబాటు వైఎస్ షర్మిలకు లభించింది.
రాజకీయాలలో ప్రత్యర్ధులను శుభకార్యాలకు ఆహ్వానించడం సాధారణ విషయమే కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ద్వేషిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఇంటికి తన సొంత చెల్లెలే వెళ్ళడం జీర్ణించుకోవడం కష్టమే. కనుక జగన్మోహన్ రెడ్డి కడుపు మంట వైసీపి నేతల ద్వారా బయటపడవచ్చు.
“పొత్తుల పేరుతో చంద్రబాబు నాయుడు కుటుంబాలను చీల్చి రాజకీయ కుట్రలు చేస్తారని” జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన చెల్లెలు కూడా టిడిపి, జనసేనలతో చేతులు కలుపుతారనే ఆవేదన, ఆందోళనే అని వేరే చెప్పక్కరలేదు.
అయితే ఆమె చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో చేతులు కలపడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా?ఒకవేళ ఆయన చెల్లిని ఆదరించి ఉండి ఉంటే నేడు ఆమె కూడా అన్నకు అండగా వైసీపిలోనే ఉండి ఉండేవారు కదా?కనుక ఇందుకు చంద్రబాబు నాయుడు నిందించడం కంటే తనను తానే నిందించుకోవలసి ఉంటుంది.




