పోలవరం విషయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాసేపటి క్రితం సమావేశం అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 నాటికి కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా గడ్కరీని కోరారు.
పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తరువాత ఇచ్చిన హామీ అమలు అయ్యేటట్లు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వినపడుతున్నాయి. పైకి ఆ పార్టీ వారు ఇలా చెబుతున్నా లోపల జరిగింది వేరు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని, నిధులు అన్ని చంద్రబాబు జేబులో చేరుతున్నాయని సత్వరం కేంద్రం ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని వారంతా మంత్రి దృష్టికి తీసుకుని వచ్చినట్టు సమాచారం. 2019లోగా ప్రాజెక్టు పూర్తి అయితే వైకాపాకు చాలా నష్టం. ప్రాజెక్టు పూర్తి అవ్వాలని వారు కోరుకుంటారని మేము భావించడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.



