ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ 2019 ఎన్నికలలో కలిసి పని చేసి తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడుని ఓడించారని అంతా అంటారు. రెండు పార్టీలు కలిసి పోటీ చెయ్యకపోయినా టీడీపీని ఇబ్బంది పెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు.
అందుకు ప్రతిగా అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా వంటి అంశాలను పక్కన పెట్టింది. అవసరమైనప్పుడు రాజ్యసభలో అధికార పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్.
అయితే ఏమైందో గానీ ఉన్నఫళంగా వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీ మీద ఎదురుదాడి చేస్తుంది. తమ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టాలని చూస్తుందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే నాని ఈ వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం.
దానిని ప్రభుత్వ సలహాదారు సజ్జల కొనసాగిస్తూ… జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ బిజెపి నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కోర్టుల నుంచి వారికి ముందే సమాచారం ఉందా అంటూ బెయిల్ రద్దు అయితే బీజేపీ హస్తం ఉండవచ్చు అన్నట్టు హింట్ ఇచ్చారు.
అప్పుల విషయంలో కేంద్రం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించకపోవడం కూడా ఈ ఎదురుదాడికి కారణం కావొచ్చు. అయితే గతంలో కేంద్రం పై పోరాటం అంటూ చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. అది పని చెయ్యలేదు. ఇప్పుడు జగన్ కూడా ఆ దిశగానే కదులుతున్నారు.



