బహిరంగ సభలలో తన కంటే మిన్నగా ప్రసంగాలు చేస్తోందని, ఇలాగే కొనసాగితే తాను కూడా వెనక్కి వెళ్లిపోతానేమోనన్న భయంతోనే సొంత సోదరి అయినా వైఎస్ షర్మిలను జగన్ పక్కన పెట్టేసారని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు సందడి చేస్తుంటాయి. ఆ ఆరోపణలలో వాస్తవం ఎంత ఉందో గానీ, షర్మిలను జగన్ పక్కన పెట్టారు అన్నది మాత్రం బహిరంగమే. రాజకీయంగా తాను ఎదగాలనుకుంటే, సొంత సోదరినే కాదనుకున్న వారికి రోజా రూపంలో పార్టీ ద్వారా లభించిన చెల్లిని జగన్ అసలు పట్టించుకుంటారా?
అయినా జగన్ కు రోజా చెల్లేంటి? అని కామెడీగా చూడకండి. వయసులో కేవలం రోజుల వ్యవధిలో రోజా పెద్దది అయినప్పటికీ, యూనివర్సల్ గా ‘జగనన్న’ అంటే పిలిస్తే ఫిక్స్ అయిపోయారు కాబట్టి… ఈ సారికి అలా అనేసుకున్నారులేండి! అలాంటి చెల్లి… పార్టీ ప్లీనరీ వేదిక మీద నుండి జగనన్నను ఓ విజ్ఞప్తి చేసింది. వైసీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలపై మహిళలకు న్యాయం చేయాలని, మద్యాన్ని అరికట్టేలా చేస్తానని ప్రకటన చేయాలని జగన్ ను కోరింది.
అయితే రోజా విజ్ఞప్తిని జగన్ పట్టించుకుంటారా? ఒకవేళ రోజా చెప్పినట్లు సదరు ప్రకటన చేస్తే మొత్తం క్రెడిట్ అంతా రోజాకు వెళ్తుంది గనుక, ఆ దిశగా ప్రకటన వచ్చే అవకాశం లేదన్నది స్పష్టం. ఇక మద్యాన్ని నియత్రించే ప్రక్రియ ఏ ప్రభుత్వమైనా చేస్తుంది అని భావిస్తే అది కలే. వైఎస్ రాజశేఖర్ హయం నుండి విచ్చలవిడితనంగా మారిపోయిన మద్యం విధివిధానాలను ఈ ప్రభుత్వమే కాస్త గాడిలో పెడుతోంది అన్న తరుణంలో… రోజా దానిని కూడా విమర్శించడం అవకాశవాద రాజకీయాలను సూచిస్తుందే తప్ప మరొకటి కాదు.
ఒకవేళ రోజా ఆరోపించినట్లుగా… నిజంగానే ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తోందని భావించినప్పటికీ, తదుపరి అధికారంలోకి వస్తామంటున్న వైసీపీ కూడా దీనిని నియంత్రించే అవకాశం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒకటి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాగా, మరొకటి ఈ మద్యం వ్యాపారులలో ఎక్కువగా ఉన్నది వైసీపీకి చెందిన వారే కావడం. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఈ వ్యాపారంలో ఉండగా, కాంగ్రెస్ పూర్తిగా తెరమరుగు కావడంతో, వారంతా జగన్ వైపుకు షిఫ్ట్ కావడంతో, ఈ మద్యం లావాదేవీలలో ఎక్కువ శాతం జగన్ పార్టీకి చెందిన వారే అన్నది స్పష్టం.



