‘అన్న వస్తున్నాడు… నవరత్నాలు తెస్తున్నాడు…’ ఇది 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ నినాదం. అక్టోబర్ నుండి మొదలు కాబోతున్న పాదయాత్ర సందర్భంగా ఈ స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసారు జగన్. అయితే తాజాగా నంద్యాలలో జగన్ ప్రసంగించిన విధానం పొలిటికల్ వర్గాలతో పాటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ‘చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా పర్వాలేదు’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన ప్రవర్తన శైలిని ప్రతిబింబిస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
వర్తమానం నుండి కట్ చేసి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… గతంలో టిడిపితో సహా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా విశాఖ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర ప్రభావితం చేసాయని చెప్పొచ్చు. కడపలో ఉన్న రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఈ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలోనూ విస్తరించాలని జగన్ చూస్తున్నారని, ఇది జరగనివ్వకుండా ఆపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందంటూ పవన్ ఇచ్చిన నినాదానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఫ్లాష్ బ్యాక్ నుండి కట్ చేసి వర్తమానంకు వస్తే… నాటి పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రజలను గుర్తు చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి కాకముందే సిఎంగా ఉన్న వ్యక్తిని చంపేయాలి అంటున్నాడు… ఒకవేళ పొరపాటున తానే సిఎం అయితే రాష్ట్రంలో ఎవరినీ బ్రతకనివ్వడు… అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక నినాదం ప్రజ్వరిల్లుతోంది. ‘హీరోయిజం’ డైలాగ్ లతో ప్రజలను ఆకట్టుకోవాలని జగన్ చేసిన ప్రయత్నం, చివరికి జగన్ లోని అసలు ‘విలనిజాన్ని’ ప్రతిబింబించిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.


