టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ని పోలీసులు నిన్న గన్నవరం కోర్టులో హాజరుపరిచినప్పుడు, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు తన మొహానికి గుడ్డ చుట్టి ఓ చీకటి గదిలోకి ఈడ్చుకుపోయి అరికాళ్ళు, అరిచేతులు వాచిపోయేలా సుమారు అర్దగంటసేపు కొట్టారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తాను ఏ నేరం చేయనప్పటికీ పోలీసులు తనని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసి రాత్రి పొద్దుపోయెవరకు వ్యానులో తిప్పుతూ చివరికి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఆ దెబ్బలకి వాచిపోయిన తన అరిచేతులు, కాళ్ళని న్యాయమూర్తికి చూపించారు.
అయితే ఆయనే టిడిపి కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ కనకారావుని కులం పేరుతో దూషిస్తూ, తన అనుచరులని దాడికి ఉసిగొల్పారని, ఆ దాడిలో కనకారావు తలకి గాయం కూడా అయ్యిందని, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని గన్నవరం డీఎస్పీ విజయ్ పాల్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
టిడిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలలో పట్టాభి స్వల్పంగా గాయపడ్డారు తప్ప పోలీస్ స్టేషన్లో ఆయనని ఎవరూ కొట్టలేదని రిపోర్టులో పేర్కొన్నారు. సీఐ కనకారావు ఫిర్యాదు మేరకే టిడిపి నేతలు పట్టాభిరామ్, దొంతు చిన్నా, జాస్తి ఆదిశేషు, లావు వంశీకృష్ణ, ముప్పరాజు కార్తీక్, కంచర్ల సూర్య, ఏ.రామకృష్ణ, జి.బాబురావు, ముప్పరాజు కార్తీక్, వీరంకి వెంకటగురుమూర్తి, చల్లగుల్ల సందీప్ చౌదరిలపై కేసు నమోదు చేసిన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి శిరీష పట్టాభిరామ్కి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్ళీ తన ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు. మిగిలినవారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.
మొన్న గన్నవరంలో ఏం జరిగిందో అన్ని టీవీ ఛానల్స్లో వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కర్రలు పట్టుకొని జై వంశీ జైజై వంశీ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపై తిరగడం, వారిని టిడిపి కార్యాలయంవైపు వెళ్లవద్దని పోలీసులు బ్రతిమలాడుకోవడం, పోలీసుల ఎదుటే వారు టిడిపి కార్యాలయం ముందున్న కారుపై దాడి చేసి నిప్పు పెట్టడం, ఆ తర్వాత టిడిపి కార్యాలయంలో ప్రవేశించి విధ్వంసం సృష్టించడం తదితర ఘటనలన్నీ అన్ని టీవీ న్యూస్ ఛానల్స్లో వచ్చాయి.
కనుక పోలీసులు వంశీ అనుచరులపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా, బాధితులైన టిడిపి నేతలపై కేసులు నమోదు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా పట్టాభిరామ్ తదితరులు పోలీసులపై దాడి, హత్యాయత్నానికి ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణ కూడా చేశారు. టిడిపికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న పట్టాభిరామ్ ఓ పోలీస్ అధికారిపై దాడి చేస్తారని, హత్యాయత్నం చేస్తారంటే నమ్మశఖ్యంగా లేదు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై దాడి, హత్య చేస్తే పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో ఆయనకి తెలియదా?
ఏది ఏమైనప్పటికీ, ఇదిప్పుడు కోర్టు-పోలీసుల వ్యవహారంగా మారింది గనుక ఇంతకు మించి మాట్లాడుకోవడం సరికాదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షాలపై ఇంతగా కక్షసాధిస్తున్నప్పుడు, రేపు టిడిపి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటి? అని వైసీపీ నేతలేప్పుడైనా ఆలోచించారో లేదో తెలీదు కానీ ఏదో రోజు వీటికి మూల్యం చెల్లించకతప్పదని గ్రహిస్తే మంచిది.



