బాలినేని పరిస్థితే ఇలా ఉంటే వైసీపిలో మిగిలినవారి పరిస్థితి?

YSRCP-Balineni

టికెట్ల కేటాయింపుల వ్యవహారంలో ఇటు వైసీపిలో, అటు టిడిపిలో పెద్ద వికెట్లు పడుతూనే ఉన్నాయి. కనుక ఒక పార్టీని మరో పార్టీ గేలి చేయవలసిన అవసరమే లేదు. టిడిపి ఎంపీ కేశినేని వైసీపిలో చేరబోతుండగా, కర్నూలు వైసీపి ఎంపీ సంజీవ్ కుమార్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.

కేశినేని నాని చంద్రబాబు నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయగా, సంజీవ్ కుమార్‌ కూడా తమ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి తీరు గురించి వివరిస్తూ, “బీసీలకి పెద్ద పీట వేశామని చెప్పుకొంటున్నారు. పెద్ద పీట వేయడమంటే ఏదో ఓ పదవి ఇచ్చి పక్కన కూర్చొబెట్టడం కాదు కదా?

ADVERTISEMENT

ఎంపీగా నేను నా నియోజకవర్గంలో పనులు చేసుకోవాలనుకున్నా జగన్‌ అనుమతి తీసుకోవలసిందే. పనుల కోసం వెళ్ళి కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఈ మాత్రం దానికి మాకు ఈ పదవులు దేనికి?

బీసీలకి పెద్ద పీట వేశామని ప్రజలకు చెప్పుకోవడానికే తప్ప వైసీపిలో మాకు, మా మాటకు ఎటువంటి విలువ, గౌరవం లేవు. గౌరవం లేని పార్టీలో, పదవిలో ఉండటం దేనికి?అందుకే నేను వైసీపికి, నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. నేను మరో 20 ఏళ్ళు రాజకీయాలలో ఉండాలనుకుంటున్నాను. కనుక నా అనుచరులతో మాట్లాడి భవిష్య కార్యాచరణ ప్రకటిస్తాను,” అని సంజీవ్ కుమార్‌ అన్నారు.

వైసీపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీలకు దక్కుతున్న గౌరవం ఈవిదంగా ఉంటే, రెడ్డి సామాజిక వర్గానికైనా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయా? వారి మాట అయినా చెల్లుతోందా? అంటే లేదనే చెపుతున్నారు ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

ఆయన తన ముఖ్య అనుచరులతో కలిసి మూడు రోజులుగా విజయవాడలో మకాం వేసి జగన్మోహన్‌ రెడ్డితో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ జగన్‌ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. విజయ సాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మూడు రోజులుగా ఎదురుచూసినా జగన్‌ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి హోటల్‌ గది ఖాళీ చేసి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. ఇంతకాలం తండ్రికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన ప్రణీత్ రెడ్డి కూడా ఈ అవమానాన్ని సహించలేక తండ్రితో కలిసి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు.

బాలినేని హైదరాబాద్‌ బయలుదేరే ముందు, “రాజశేఖర్ రెడ్డికి, జగన్‌ రెడ్డికి చాలా తేడా ఉంది. పెద్దాయన పార్టీలో అందరినీ చిన్నా పెద్దా అని బేధం చూపకుండా సమానంగా గౌరవించేవారు. ఎప్పుడు కలవాలనుకున్నా నేరుగా ఫోన్ చేసి అడిగితే రమ్మనమని చెప్పేసేవారు. తనను నమ్ముకున్నవాళ్ళను, ఆయన నమ్మినవాళ్ళకు చాలా గౌరవించేవారు. కానీ ఆయన లక్షణాలు ఏవీ జగన్‌లో లేవు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా చేశాను. నా వంటి సీనియర్‌కు జగన్‌ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది! ఇంకా అవమానాలు భరించాల్సిన అవసరం ఏమిటి? నేను ఒంగోలు నుంచే మళ్ళీ పోటీ చేయబోతున్నాను,” అని చెప్పి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు.

జగన్‌ బంధువు కూడా అయినా బాలినేనికి కూడా గౌరవం లేదంటే వైసీపిలో మిగిలిన నేతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories