ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణకు ఓ ధర్మ సందేహం కలిగింది. విజయవాడలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మూడు రాజధానులకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే మేము విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి కాపురానికి, రాజధానికి సంబంధం ఏమిటి? ఒకవేళ సంబందం ఉందనుకొంటే చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉండకుండా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు?” అని ప్రశ్నించారు.
అయితే ప్రతిపక్షాలు కూడా మొదటి నుంచి ఇదే చెపుతున్నాయి. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడైనా కాపురం పెట్టుకోవచ్చు కానీ రాజధాని మాత్రం అమరావతే అని చెపుతున్నాయి. ముఖ్యమంత్రి ఇల్లు మార్చుకోవచ్చు కానీ రాజధాని మారదని పదేపదే చెపుతున్నాయి. ఏపీలో ఒక్క వైసీపీ తప్ప మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అమరావతే రాజధానిగా ఉండాలని గట్టిగా చెపుతున్నాయి. ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారు. కానీ వైసీపీ నేతలే ఓసారి మూడు రాజధానులని, ఓసారి విశాఖ ఒకటే రాజధాని అని చెపుతున్నారు.
సిఎం జగన్మోహన్ రెడ్డే స్వయంగా మార్చిలో విశాఖకి షిఫ్ట్ అవుతాను.. కాదు… జూలైలో కాదుకాదు… సెప్టెంబర్లో విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొంటుంటే మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా ఆయనకు తాళం వేస్తున్నారు. ప్రతిపక్షాలు కానీ, ప్రజలు గానీ ఏనాడూ సిఎం జగన్మోహన్ రెడ్డిని విశాఖలో కాపురం పెట్టాలని కోరడంలేదు కదా? కానీ విశాఖలో కాపురం పెడతానని చెపుతున్న జగన్మోహన్ రెడ్డే మాటిమాటికి మాట మారుస్తున్నారు కదా? పైగా ఆయన విశాఖలో కాపురం పెట్టడానికి గల ‘రాజకీయ కారణాలు’ కూడా మంత్రులే చెప్పుకొంటున్నారు కదా? మళ్ళీ కాపురానికి, రాజధానికి సంబంధం ఏమిటని బొత్స వారికి ధర్మసందేహం దేనికి?
మంత్రి బొత్సవారు ఓ మంచి మాట కూడా చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. పారదర్శకంగా బదిలీలల కోసం ఇతర రాష్ట్రాల విధానలను అధ్యయనం చేస్తామని చెప్పారు.
అయితే మంత్రి బొత్స స్వయంగా ఇటీవల శాసనసభ బడ్జెట్ సమావేశాలలో “ఉపాద్యాయుల పదవీ విరమణ వయసు రెండేళ్ళు పెంచడం వలన ఉద్యోగాలు ఖాళీ లేవని అందుకే డీఎస్సీ తీయలేదని” చెప్పారు. ఇప్పుడు తీస్తామని చెపుతున్నారు. ఒకవేళ తీసినా ఈ ప్రక్రియ ఎన్నికలలోగా ముగిసేది కాదు. వచ్చే విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని మంత్రిగారే చెప్పుకొంటున్నారు కదా? మరెందుకు నిరుద్యోగులకు ఆశ చూపడం… మభ్యపెట్టడం?
“వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మేము వ్యతిరేకం” అని చెప్పి మంత్రి బొత్స మరోసారి చేతులు దులుపుకొన్నారు. ఆ మాటతో దాని అమ్మకం నిలిచిపోదు కదా?కనీసం పొరుగు రాష్ట్రం చొరవ చూసిన తర్వాత అయినా వైసీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెట్టి కాపాడుకొనే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు?



