నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ, “2024 ఎన్నికలలో మన పార్టీ బీజేపితో పొత్తు పెట్టుకోకుండా పెద్ద తప్పు చేసిందని భావిస్తున్నాను.
2019 నుంచి 2024 వరకు మనం పార్లమెంటులో కేంద్రానికి మద్దతు ఇస్తూనే ఉన్నాము. ఐదేళ్ళ పాటు బీజేపి పెద్దలతో సఖ్యత ఉన్నప్పుడు ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటే తప్పు కాదు. ఆ పార్టీ కూడా మనతో పొత్తులకు ఆసక్తిగా ఉందని విన్నాను. కానీ మనం పూర్తి 5 ఏళ్ళు వారితో కలిసి పనిచేసి, సరిగ్గా ఎన్నికలప్పుడు బీజేపీకి దూరమయ్యాము.
పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని టీడీపీ, బీజేపిల మద్య పొత్తు కుదిర్చారు. ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకొని బీజేపితో మళ్ళీ పొత్తుపెట్టుకొని లాభపడ్డారు.. మనం నష్టపోయాము.
కనుక ఈసారి నేనుజగన్మోహన్ రెడ్డిని కలిస్తే బీజేపితో పొత్తుకి ప్రయత్నించామని తప్పకుండా చెపుతాను. మోడీ, అమిత్ షాలకు చంద్రబాబు నాయుడుపై నమ్మకం లేదు కనుక జగన్ గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా వారు వచ్చే ఎన్నికలలో వైసీపీతో పొత్తుకి అంగీకరించవచ్చు,” అని అన్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన కేసులు, అప్పుల కోసం మోడీ, అమిత్ షాలతో వినయ విధేయంగా మెలిగిన మాట వాస్తవం. అందుకే జగన్ ఎన్ని చేయకూడని తప్పులు చేస్తున్నా, రాష్ట్రానికి ఎంతగా నష్టం కలిగిస్తున్నా మోడీ, అమిత్ షాలు చూసి చూడనట్లు ఊరుకున్నారే తప్ప వారించలేదు.
బీజేపికి వైసీపీ ఎంతో టీడీపీ కూడా అంతే. అందుకే చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా మోడీ, అమిత్ షాలు కనీసం స్పందించలేదు. కనుక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినట్లుగా ఒకవేళ జగన్ బీజేపితో పొత్తులకి ప్రయత్నించి ఉంటే కుదిరే ఉండేవేమో?
కానీ రాష్ట్రంలో మైనార్టీ, క్రీస్టియన్, బడుగు బలహీన వర్గాల ఓటు బ్యాంక్ పోతుందని భయపడి బీజేపితో పొత్తుకి ఇష్టపడలేదు లేదా సిద్దపడలేదు. కానీ ఒకవేళ జగన్ బీజేపితో పొత్తు పెట్టుకుంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపికి దూరమయ్యి టీడీపీతో చేతులు కలిపేవారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ వాటితో కొనసాగినా ఆ కాంబినేషన్కి ప్రజలు మెజార్టీ ఇస్తారనే నమ్మకం లేదు. కానీ బీజేపి, జనసేనలు టీడీపీతో చేతులు కలిపాయి కనుకనే ఈ కాంబినేషన్ సూపర్ హిట్ చేశారు ప్రజలు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా ఇదే కాంబినేషన్తో మూడు పార్టీలు కలిసి వెళ్ళడం ఖాయమే.
కనుక ప్రసన్న కుమార్ రెడ్డి కోరిక తీరే అవకాశం లేదు… వచ్చే ఎన్నికలలో కూడా జగన్ సింగిల్ సింహం స్టేటస్ మెయిన్టెయిన్ చేయాల్సిందే.




