సవాల్ చేసారు… టిడిపి సై అంటే గృహనిర్బందం చేయించారు!

Gopireddy_Srinivas_Reddy_Chadalavada_Aravindababuపల్నాడు జిల్లా నరసారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఇటీవల నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నరసరావుపేట టిడిపి ఇన్‌ఛార్జ్‌ చదలవాడ అరవింద్ బాబు కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.

నాలుగేళ్ళ క్రితం చనిపోయిన ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై చదలవాడ అరవింద్ బాబు తీవ్ర అభ్యంతరం చెప్పారు.

ADVERTISEMENT

నియోజకవర్గంలో ఇసుక, బియ్యం, గుట్కా,మట్కా, గంజాయి, భూముల సెటిల్మెంట్స్, కబ్జాలు ఇలా ప్రతీ అవినీతి, అక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరూపించగలనని అన్నారు.

చదలవాడ చేసిన ఈ ఆరోపణలపై గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందిస్తూ దమ్ముంటే ఇవాళ్ళ ఉగాది రోజున కోటప్పకొండలో స్వామివారి ముందు ప్రమాణాలు చేయడానికి రావాలని సవాల్ విసిరారు. అందుకు చదలవాడ కూడా అంగీకరించి, జిల్లా ఎస్పీ అనుమతి కూడా తీసుకొన్నారు. ఈరోజు ఉదయం ఆయన ఇంటివద్ద నుంచి కోటప్పకొండకు బయలుదేరుతుంటే, గుమ్మం వద్దనే పోలీసులు వచ్చి అడ్డుకొన్నారు. కోటప్పకొండవద్దకు వెళ్ళేందుకు అనుమతిలేదని చెపుతూ గృహనిర్బందం చేశారు.

తనను గృహనిర్బందం చేయడంపై చదలవాడ విలేఖరులతో మాట్లాడుతూ, “వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని నేను ఆరోపిస్తే, కోటప్పకొండకు వచ్చి ప్రమాణం చేసి నిరూపించాలని ఆయనే సవాలు విసిరారు. ఇప్పుడు నేను అక్కడికే బయలుదేరుతుంటే, పోలీసులు నన్ను గృహనిర్బందం చేశారు. అంటే నేను వస్తే ఆయన అవినీతిని నలుగురి ముందు బయటపెడతాననే భయంతోనే పోలీసుల చేత నను అరెస్ట్ చేయించారని భావిస్తున్నాను. నేను ముందుగానే దీని కోసం ఎస్పీని కలిసి అనుమతి తీసుకొన్నాను. కానీ హటాత్తుగా అనుమతి ఎందుకు నిరాకరించిన్నట్లు?అంటే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాను అవినీతికి పాల్పడుతున్నానని అంగీకరించిన్నట్లేనా?అని టిడిపి నరసారావుపేట ఇన్‌ఛార్జ్‌ చదలవాడ అరవింద్ బాబు ప్రశ్నించారు.

ADVERTISEMENT
Latest Stories