కేసులన్నీ జమ్మిచెట్టు మీద ఆయుధాల వంటివేనా?

Jagan YS Viveka

అలనాడు పాండవులు విరాట మహారాజు కొలువులో ఏడాది పాటు అజ్ఞాతవాసానికి వెళుతున్నప్పుడు అత్యంత శక్తివంతమైన తమ ఆయుధాలన్నిటినీ మూటకట్టి జమ్మి చెట్టుమీద దాచారు. ఈ కధ అందరికీ తెలిసిందే.

అదేవిదంగా దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీసేందుకు వీలైతే అణచివేసేందుకు అనేక కేసులు నమోదు చేస్తుంటాయి. వాటిలో నిజంగా నేరం జరిగిన కేసులు, నేరం జరిగిన్నట్లు నిరూపించి ఇరికించేందుకు నమోదు చేసిన కేసులు కూడా ఉంటాయి. నేరం జరిగిందా లేదా?అనేది ముఖ్యం కాదు. ఆ కేసుతో తమ రాజకీయ ప్రత్యర్ధిని దెబ్బ తీయగలుగుతామా లేదా అనేదే ముఖ్యం.

ADVERTISEMENT

అందుకే కేసులన్నీ అధికార పార్టీలకు జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాల వంటివే అని భావించాల్సివస్తోంది. అవసరమైనప్పుడు వాటిని దించుతూ, లేనప్పుడు మళ్ళీ మూట కట్టి అటక మీద పడేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ కల్వకుంట్ల కవితకు నోటీస్ పంపించడం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సీబీఐ, ఈడీ, ఐ‌టి, ఎన్ఐఏ, సిఐడీ, ఏసీబీ తదితర సంస్థలు కేసులు నమోదు చేసి ఎంతో శ్రమించి దర్యాప్తు, విచారణ చేస్తుంటాయి. వాటి గురించి అనేక మంది అధికారులు, అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ తీవ్ర వ్యయ ప్రయాసలు భరిస్తూ, తీవ్ర రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ సాక్ష్యాధారాలు సేకరిస్తుంటారు.

ఆ తర్వాత దశలో అవన్నీ ఆయా కోర్టులకు చేరుకుంటాయి. అక్కడా అనేకమంది న్యాయవాదులు వాటిపై తమ వాదనలు వినిపిస్తుంటారు. న్యాయస్థానాలు సుదీర్గంగా ఈ కేసుల విచారణ చేస్తుంటాయి.

వీటన్నికి ఏటా వేల కోట్లు ఖర్చు అవుతుంటాయి. అయితే ఇంతమంది శ్రమించి వేలకోట్లు ఖర్చు చేసిన తర్వాత నేరస్తులను నిర్ధారిస్తారా? నేరస్తులకు శిక్ష పడుతుందా?అంటే కాదనే అందరికీ తెలుసు. జగన్‌ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు వంటివి మన కళ్ళ ముందే ఉన్నాయి.

నేరస్తులకు శిక్షించలేనప్పుడు మరి ఈ కేసులు, విచారణ, అధికారుల హడావుడి, వీటి కోసం ఖర్చుచేస్తున్న వేలకోట్ల ప్రజాధనం అంతా వృద్ధాయే కదా?అంటే అవుననే చెప్పవచ్చు. అంటే దేశానికి, రాష్ట్రాలకు, ప్రభుత్వాలకు వీటి వలన నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండదని స్పష్టమవుతోంది.

మరైతే ఎందుకు ఈ వృధా ఖర్చులు, వృధా శ్రమ?అంటే ముందే చెప్పుకున్నట్లు అధికారంలో ఉన్న పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసమే!

పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి ఒక్కసారే ఆయుధాలు కిందకు దించుకుని కురుక్షేత్ర యుద్ధం చేసి విజయం సాధించారు. కానీ మన రాజకీయ పార్టీలు అవసరమైనప్పుడు ఈ ఆయుధాలు కిందకు దించి వాడుకుంటూ మళ్ళీ పైన పెట్టేస్తుంటాయి. అంటే మన రాజకీయ పార్టీలు పాండవుల కంటే తెలివైనవన్న మాట!

ADVERTISEMENT
Latest Stories