వైఎస్ షర్మిల రాకతో వైసీపి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. ఆమె తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ధీటుగా జవాబులు చెప్పుకోలేక వైసీపి నేతలు తల పట్టుకుంటున్నారు. ముఖ్యంగా తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా మహిళలను చాలా ఆలోచింపజేస్తున్నాయి.
ఇప్పుడు ఆమెను పోలీసు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో, జగన్ ప్రభుత్వం ప్రజలకు చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లు అవుతోంది.
పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ, “మేము నిరుద్యోగుల సమస్యల గురించి ప్రభుత్వానికి మా నిరసన తెలపాలనుకున్నాము. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. అందువల్లే నేడు నిరుద్యోగులతో కలిసి ‘ఛలో సచివాలయం’ నిర్వహించాలనుకుంటే, జగనన్న ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులతో అడ్డుకొంటూ, మమ్మల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తోంది?
మేమేమైన ఉగ్రవాదులమా… సంఘ విద్రోహ శక్తులమా?పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వెంటబడితే వారి నుంచి తప్పించుకొని నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తలదాచుకోవలసి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలినైనా నా పరిస్థితే ఈ విదంగా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
సొంత చెల్లినైనా నన్నే అరెస్ట్ చేయించాలనుకోవడం, నేను మా పార్టీ కార్యాలయంలో తలదాచుకోవలసి రావడం మీకు (జగన్మోహన్ రెడ్డి)కి అవమానం అనిపించడం లేదా?” అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఆమెను జగన్ చెల్లిగా కాకుండా ప్రతిపక్ష పార్టీ నేతగా మాత్రమే చూస్తున్నామంటూ వైసీపి నేతలు సమర్ధించుకోవచ్చు. కానీ వైఎస్ షర్మిలని అరెస్ట్ చేస్తే ప్రజలు మాత్రం వేరేలా భావించక మానరు.
జగన్ బటన్ నొక్కుడు సభలలో ‘నా అక్కలు, నా చెల్లెమ్మలు…’ అంటూ మాట్లాడుతూ, బయట సొంత చెల్లెలు వైఎస్ షర్మిలని పోలీసులతో అరెస్ట్ చేయిస్తే, ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని ప్రజలు గ్రహించలేరా?
ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు, అన్న గురించి షర్మిల చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వైసీపికి శాపాలుగా మారకుండా ఉంటాయా?





