వైసీపీ ఆఫీస్ ను విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ లక్ష్మీ పార్వతి అధినేతపై ఉన్న మక్కువను, మమకారాన్ని ఓ రేంజ్ లో కురిపించింది. నాటి 94 ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు అంటూ మండిపడిన లక్ష్మీ పార్వతి, నాడు 90% మంది నాయకులు తన కాళ్ళు పట్టుకుని టికెట్స్ తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలా ‘చంద్రబాబు అండ్ కో’పై విమర్శలు గుప్పించిన లక్ష్మీ పార్వతి, మరో వైపు ‘వైఎస్సార్ అండ్ జగన్’లపై ప్రశంసలను కురిపించారు.
జగన్ నా చిన్న బిడ్డ… ఎంత ప్రేమమయి… ప్రతి ఒక్కరిని ప్రేమగా అక్కున చేర్చుకుంటారే… దేనికి వెరవని రాయలసీమ సింహం… నిజమైన ప్రజాసేవ చేసేటటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్… ఆయన్ని నిలబెట్టుకుంటే రాష్ట్రానికి ఎంత మంచి భవిష్యత్తు వస్తుందో మాటల్లో చెప్పలేం… జగన్ మోహన్ రెడ్డి లాంటి మంచి నీతివంతమైన నాయకుడు మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా… ఎక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎక్కడ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్సార్, జగన్ ల గురించి అనర్గళంగా మాట్లాడారు.
లక్ష్మీ పార్వతి గారు చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ వర్గాల నుండి మంచి స్పందన రాగా, టిడిపి వర్గాలకు మాత్రం హాస్యాస్పదంగా మారాయి. ముఖ్యంగా నీతివంతమైన నేతగా జగన్ ను అభివర్ణించడం, నిజమైన ప్రజాసేవ చేసే నాయకుడిగా జగన్ ను పేర్కొనడం వంటి ప్రశంసలు హస్యప్రియులకు వరంలా మారాయి. జగన్ పై మరే ఇతర నేత ఈ రేంజ్ లో పొగడ్తల అగడ్తలకు అవకాశం లేని విధంగా అతిశయోక్తులతో ముంచెత్తారు జగన్ మరో తల్లి.



