అనూహ్య మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవిలో ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆ సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా… ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలి అనే తీర్పుతో సుప్రీం కోర్టు గాలి తీసేసింది. మరోవైపు… పలువురు నేతలు అసమ్మతి గళం వినిపించడం గమనార్హం.
ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామరాజు చాలా కాలంగా అసమ్మతితో ఉన్నారు. టీటీడీ భూముల వివాదం, నిమ్మగడ్డ వ్యవహారంపై సొంత ప్రభుత్వం పైనే ఆయన మీడియా సమక్షంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుక అక్రమాలపై ఘాటైన విమర్శలు చేశారు.
రీచ్లో లోడింగ్ అయిన ఇసుక లారీ డిపోకు వచ్చేసరికి మాయమైపోతోందని అధికారిక సమావేశంలో చెప్పడం సంచలనం సృష్టించింది. తాజాగా… మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏడాదిగా తన నియోజకవర్గాన్ని పాలకులు విస్మరించారని, ఇలాగైతే పోరాటం తప్పదని చెప్పుకొచ్చారు.
వెంకటగిరిని రాష్ట్ర పటం నుంచి తొలగించారా అని ప్రశ్నించారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆయన అన్నారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచినా అసమ్మతి తప్పకపోవడం జగన్ పాలన మీద, పార్టీ మీద పట్టు కోల్పోతున్నారా అనే అనుమానాలు సొంత పార్టీ వారిలో కూడా లేకపోలేదు.



