ఏపీలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ అధినేత ఎస్ జగన్ ఇప్పటి నుంచే తన పార్టీ నేతలకు, క్యాడర్ కు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం తాలూకా ఏకగ్రీవాలు వైఎస్ జగన్ ను వెంటాడుతున్నాయో ఏమో కానీ ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు జరగడానికి వీలులేదంటూ పార్టీ లీడర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చేసారు.
కూటమి ప్రభుత్వం తన అధికారంతో దౌర్జన్యాలకు దిగినా, పోలీసుల అండతో అక్రమాలకు పాల్పడినా పార్టీ లీడర్లు క్యాడర్ కి పూర్తి మద్దతు ఇస్తూ ధైర్యంగా ఎన్నికల నామినేషన్ వేయాలంటూ, యుద్ధం జరగాల్సిందే అని జగన్ తన పార్టీ క్యాడర్ కి పిలుపునిస్తున్నారు.
అలాగే ఏకగ్రీవాలకు తానూ వ్యతిరేకమని, ఇది అప్రజాస్వామ్యం అంటూ పార్టీ శ్రేణులకు గీతాభోధనలు చేస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో ‘నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్’…గుర్తుకొస్తున్నాయా…అంటూ సోషల్ మీడియాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించిన పుంగనూరు అంజిరెడ్డి తాత వీడియో వైరల్ అవుతుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కీలక నేత పెద్దారెడ్డి కంచుకోటగా భావించే పుంగనూరు నియోజకవర్గంలోని మాదాలపల్లె గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ తరుపున నామినేషన్ వెయ్యకుండా వైసీపీ గుండాలు అడ్డుకుంటున్నా, ఎనిమిది పదుల వయసున్న అంజిరెడ్డి అనే ఒక పెద్దాయన తొడకొట్టి, మీసం మెలేసి, రండి చూసుకుందాం అంటూ నడి రోడ్డు మీద వైసీపీ శ్రేణులకు సవాల్ విసురుతూ టీడీపీ తరుపున నామినేషన్ వేశారు.
దీనితో నాడు అంజిరెడ్డి తాత సోషల్ మీడియా లో హీరో అయ్యారు, టీడీపీ క్యాడర్ కి ఒక దిక్సూచి ల మారారు. ఎనిమిది పదుల వయస్సులో కూడా తగ్గేదెలా అంటూ పార్టీ జెండా కోసం వైసీపీ లాంటి ఆర్థికంగా, రాజకీయంగా బలమైన పార్టీని ఎదిరించి అంజిరెడ్డి తాత ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు.
అయితే తాజాగా జగన్ చేస్తున్న ఏకగ్రీవాల గీత బోధనలతో మరోసారి అంజిరెడ్డి తాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అలాగే అటు వైసీపీ క్యాడర్ కి సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు.






