వైసీపీ నేతలు.. వారి వెంటే వీర విధేయులు!

jana-sena-pawan-kalyan-samineni-udaya-bhanu-balineni-srinivas-reddy

జగన్‌ ‘ఎల్లో’ ముద్ర వేసిన మీడియాలో తనకు వ్యతిరేకంగా వ్రాస్తున్నాయని, తనను రాజకీయంగా దెబ్బ తీయడానికే ప్రయత్నిస్తున్నాయని గట్టిగా నమ్మేవారు.

కానీ తన ధోరణిలో, తన ప్రభుత్వ విదానాలలో లోటుపాట్లు, వైఫ్యల్యాలు, జరుగుతున్న అవకతవకలు, దౌర్జన్యాల గురించి అవి చెపుతున్న విషయాలను చెవి కెక్కించుకొని, అ లోపాలను సరిచేసుకొని ఉంటే నేటికీ జగన్‌ ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉండేవారు. తన ఓటమికి ఈవీఎంలు కారణమని నిందించాల్సిన అవసరం ఉండేదే కాదు.

ADVERTISEMENT

కానీ ‘బచ్చలమల్లి’లో అయినా మార్పు వస్తుంది కానీ జగన్‌లో అసాధ్యమని తన 5 ఏళ్ళ రాక్షస పాలనతో నిరూపించి చూపారు.

నాడు ‘ఎల్లో’ ముద్ర పడిన మీడియాయే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని తప్పొప్పులను కూడా నిర్భయంగా ఎత్తి చూపుతూ, సిఎం చంద్రబాబు నాయుడుని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం.

వాటిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఏవిదంగా స్వీకరిస్తున్నారో తెలీదు కానీ టీడీపీ, జనసేనల శ్రేయోభిలాషులు జీర్ణించుకోలేకపోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే అర్దమవుతుంది.

శ్రేయోభిలాషి అంటే భజన చేయడం కాదు. తప్పొప్పులను నిష్పక్షపాతంగా విశ్లేషించి ధైర్యంగా చెప్పేవాడే శ్రేయోభిలాషి.

ఇందుకు ఉదాహరణగా ఆంధ్రజ్యోతిలో జగన్‌ వీరభక్త అధికారి జయచంద్ర గాంధీ గురించి వచ్చిన ఓ తాజా కధనం చెప్పుకోవచ్చు.

వైసీపీ హయంలో ఆయన చాలా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడుపై బహిరంగంగానే విమర్శించేవారు. ఆయన వాట్సప్ డీపీగా జగన్‌ ఫోటో ఉండేదంటే ఎంత వీరభక్తుడో అర్దం చేసుకోవచ్చు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి ఆయన ప్రియ శిష్యుడు కూడా. ఇప్పుడు ఉదయభాను జనసేనలో చేరినందున, ఆయన ద్వారా ఎన్టీఆర్ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పదవి దక్కించుకోబోతున్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

చంద్రబాబు నాయుడుని ద్వేషించిన, అవహేళన చేసిన వైసీపీ నేతలను టీడీపీ, జనసేనలో చేర్చుకోవడమే తప్పు అనుకుంటే జగన్‌ విధేయులైన అధికారులకు కీలక పదవులు కట్టబెడుతుండటం ఇంకా పెద్ద తప్పు. పాములకి పాలు పోసినా కాటేయడం వాటి సహజ లక్షణం. జగన్‌ వీరభక్త అధికారులు కూడా అటువంటివారే.

ప్రభుత్వంలో పనిచేసే వారికి ఏదో ఓ రాజకీయ పార్టీపై అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ అటువంటి వీర విధేయులు ప్రభుత్వంలో కీలక పదవులలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పోర్టులో తనికీలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు, పేర్ని నాని గోదాముల నుంచి బియ్యం మాయమైనా చర్యలు చేపట్టడానికి అధికారులు తటాపటాయించడం వంటివన్నీ చిన్నచిన్న ఉదాహరణలు.

ఇప్పుడు వైసీపీలో నుంచి వస్తున్న నేతలు జగన్‌ వీర విధేయులను ఈవిదంగా కీలక పదవులలో సెట్ చేస్తుంటే, వారు లోపలే ఉండి ఎంత హానీ చేస్తారో ఎవరూ ఊహించలేరు. కనుక మళ్ళీ అదే ‘ఎల్లో మీడియా’ బాధ్యతగా కూటమి ప్రభుత్వాన్ని ‘తస్మాత్ జాగ్రత్త’ అని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వాటి హెచ్చరికలను, హితోక్తులను సానుకూలంగా స్వీకరిస్తే దానికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories