రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచినట్టుగా మారిపోయింది రాష్ట్రంలో ఎండ తీవ్రత. పెరిగిన ఎండ తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోతతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ బారిన పడ్డారు.
ఈ విషయమై అటు జైలు అధికారులకు, ఇటు ములాఖత్ లో కలిసిన కుటుంబసభ్యులకు చంద్రబాబు సమాచారం ఇచ్చారు. ఏడు పదుల వయస్సులో అనారోగ్యానికి గురైతే కోలుకోవడం కష్టమని బాబు కుటుంబసభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలుగు తమ్ముళ్లు కూడా తమ నేత ఎంత ఆరోగ్యంగా అయితే జైలుకు వెళ్లారో అదే విధంగా తిరిగి రావాలంటూ దేవాలయాలలో పూజ కార్యక్రమాలు చేపడుతున్నారు.
పక్క వాడు బాధలో ఉంటే మనం సాయం చేయకపోయినా పరవాలేదు కానీ హేళన చేయకూడదు అనే కనీస మానవత్వ విలువలు కూడా లేని వైసీపీ నేతలు మీడియా ముందు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఏపీలో రాజకీయాలు ఇంతకూ దిగజారిపోయాయా? అన్న సందేహం రాకమానదు.
ఏపీ కోడిగుడ్డు మంత్రి అదే లేండి., నూడిల్స్ బండ్ల ప్రారంభోత్సవాలతో ఆంధ్రాకు కొత్త పరిశ్రమలు తెచ్చిన ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్ గారు చంద్రబాబు వెళ్ళింది వెకేషన్ కు కాదు జైలుకి, మరి అక్కడ డీహైడ్రేషన్ రాకపోతే మరేమొస్తది?అంటూ చేసిన వెటకారం వైసీపీ నేతల రాజకీయ అహంకారానికి నిదర్శనంగా చెప్పాలి.వెకేషన్ లో మాత్రమే పాలన చేసే వైసీపీ నేతలకు ఇంతకన్నా ఎక్కువ రాజకీయ పరిపక్వత ఉంటుందని ఆశించడం మన తప్పే అవుతుంది మరి.
వైసీపీ పార్టీలో ఇటువంటి నేతలకు కొదవేలేదనుకోండి..,ఇలాగే మొన్న బూతుల మంత్రిగా పేరుపొందిన కొడాలి నాని జైల్లులో దోమలు ఉండకా రంభ..,ఊర్వసిలు ఉంటాయా? అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయి ఎంతకు దిగజారిందో మరో సారి ఏపీ ప్రజలకు గుర్తుచేశారు. అంటే జైలు జీవితాల గురుంచి ఆ పార్టీ నేతలకు ఉన్న అనుభవాలు మరే ఇతర పార్టీ నేతలకు లేకపోవడమే ఇందుకు గల కారణం.
ఇక గంట అరగంట మంత్రి కథ చెప్పనవసరమే లేదు. ఆయన నోరూ మూయలేరు, రాష్ట్రానికి నీళ్లు తేలేరు! అనేది తేలిపోయింది.ఇలా మీడియా ముందుకు వచ్చి చేస్తున్న వైసీపీ నేతల ఓవర్ యాక్షన్ చూస్తుంటే “కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు” అనే సత్యాన్ని అధికారం అనే అడ్డుతెర తొలిగినరోజు వైసీపీ నేతలు తప్పక గ్రహిస్తారు. అప్పుడు వారికి డీహైడ్రేషన్ కాదు డిప్రెషనే! అనేది గుర్తుంచుకోవాలి.



