స్టిక్కర్ వేసుకోకుండా టికెట్‌ అడిగితే ఎలా నాయినా?

Alla-Ramakrishna-Reddyఈమాట అన్నది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి. మొదట్లో టిడిపి మీద కోర్టులో కేసులు వేసి చాలా హడావుడి చేసిన ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నిర్వహించిన సమావేశానికి కూడా డుమ్మా కొట్టడంతో ఈసారి తనకు మంగళగిరి టికెట్‌ లభించదని తెలిసే పార్టీకి దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని బలపరుస్తున్నట్లు ఆయన ‘నువ్వే మా నమ్మకం సిఎం జగన్‌’ స్టిక్కర్ అంటించే కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు. టికెట్‌ ఇవ్వకపోయినా నువ్వే మా నమ్మకం జగనన్న అని ఎవరైనా ఎలా అనగలరు? వైసీపీ ఎమ్మెల్యేలకే తమ జగనన్న మీద నమ్మకం లేకపోతే ఇక ప్రజలకేముంటుంది?అని సందేహం కలగడం సహజం.

ADVERTISEMENT

ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చాలా రోజుల తర్వాత నిన్న అధికారులతో కలిసి మంగళగిరిలో పర్యటించి పెద్ద కోనేరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మళ్ళీ టిడిపిని, మాజీ మంత్రి నారా లోకేష్‌ని విమర్శించి 2024 ఎన్నికలలో జగనన్న ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అంటే టికెట్‌ ఇస్తే పార్టీ కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పకనే చెప్పారనుకోవచ్చు. కానీ ‘నువ్వే మా నమ్మకం జగన్‌’ అని ఇంకా అనలేదు. ఆ స్టిక్కర్ తగిలించుకోలేదు. అంటే టికెట్‌ ఇవ్వకపోతే పార్టీలో నుంచి జంప్ చేసే అవకాశం కూడా ఉందనుకోవచ్చు.

ఒకవేళ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గోడ దూకేయాలనుకొంటే అవతలివైపు జనసేన, బిజెపి రెండు పార్టీలున్నాయి. కానీ ఒకవేళ జనసేన టిడిపిలు పొత్తులుపెట్టుకొంటే ఆ నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ పోటీ చేయాలనుకొంటున్నారు కనుక దానిని టిడిపికి వదిలేయవలసి ఉంటుంది. కనుక అళ్ళ జనసేనలోకి దూకలేరు.

ఇక మిగిలింది బిజెపి. ఇటీవలే కిరణ్‌ కుమార్‌ రెడ్డి బిజెపిలో చేరి ఏపీలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వస్తానంటే ఆయనకు బిజెపి స్వాగతం పలకవచ్చు.

మరి ఆళ్ళకు టికెట్‌ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వైసీపీలోనే ఉంచుకొంటారా లేక వదులుకొంటారా అనే విషయం ఈ స్టిక్కర్స్ కార్యక్రమంపై జరిగే సమీక్ష సమావేశంలో తేలిపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది ఈలోగా బిజెపిలో కర్చీఫ్ వేసి ఉంచుకొంటే మంచిది లేకుంటే అది కూడా మంగళగిరి టికెట్‌ ఎవరికైనా కమిట్‌ అయిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories