కూటమిది తొందరపాటా.. వ్యూహాత్మకమా?

YSRCP MLAs Face Disqualification – Strategic Move?

సోమవారం నుంచి మొదలైన ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ఊహించిన్నట్లే వైసీపీ అధినేత జగన్‌ 10 ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వచ్చారు. కనీసం గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేవరకైనా ఉంటారనుకుంటే, ఆయన ప్రసంగిస్తుండగానే నినాదాలు చేసి వాకవుట్ పేరుతో సభలో నుంచి పారిపోయారు.

ADVERTISEMENT

రాష్ట్రానికి ప్రధమ పౌరుడైన గవర్నర్ ఉభయసభలని ఉద్దేశయించి ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేయడం ఓ తప్పు.

తాను ఎంతమందినైనా ఒంటరిగా ఎదుర్కోగల సింహానని గొప్పగా చెప్పుకున్న జగన్‌, తోక ముడిచి శాసనసభలో నుంచి పారిపోయినందుకు సిగ్గు పడాలి.

వైసీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇస్తే తాము సభకు వచ్చి నిలదీస్తామనే భయంతోనే కూటమి ప్రభుత్వం నిరాకరిస్తోందని రోజా వంటి వైసీపీ నేతలు విమర్శించడం ఇంకా సిగ్గుచేటు.

జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలకు తమకి ఓట్లు వేసి గెలిపించిన 11 నియోజకవర్గాల ప్రజల పట్ల బాధ్యత, ప్రజాస్వామ్యం, చట్ట సభలంటే గౌరవం ఉండి ఉంటే ప్రధాన ప్రతిపక్షహోదా లేకపోయినా శాసనసభకి వచ్చి ఉండేవారు. కానీ ఆ రెండూ లేకపోగా శాసనసభకి వచ్చేందుకు భయం కూడా ఉంది.

తమ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిసిగ్గుగా ఈవిదంగా వితండవాదం చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు అర్దం కాదని అనుకోవడం కూడా అహంభావమే. కానీ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే హాజరు కోసం వచ్చారని ప్రజలకు కూడా తెలుసు.

జగన్‌తో సహా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసి ఉప ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉన్నప్పుడు, వారిని ముందుగా హెచ్చరించి ఈ గండం నుంచి వారు ఇంత సలువుగా తప్పించుకునేలా చేయడం తొందరపాటే అనిపిస్తుంది.

కనుక అనర్హత వేటు గురించి ముందే హెచ్చరించి స్పీకర్‌, డెప్యూటీ స్పీకర్‌ వారికి చాలా మేలు చేశారా?అనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అది రాజకీయంగా చాలా తెలివైన నిర్ణయంగా అనిపించవచ్చు.

కానీ జగన్‌ దానిని అనుకూలంగా మార్చుకొని ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నించకుండా ఉండరు. శాసనసభలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసి సిఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారంటూ ఢిల్లీ వెళ్ళి హడావుడి చేస్తారు.

శాసనసభకు మొహం చాటేసి ఇంతగా వితండావాదం చేస్తున్న వైసీపీ నేతలు, అనర్హత వేటు పడితే సోషల్ మీడియాలో గోలగోల చేయకుండా ఊరుకుంటారా?

ఎమ్మెల్యే పదవులు ఉన్నంత కాలమే జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని, వారికి ప్రజాస్వామ్యం, చట్టసభలు అంటే ఏమాత్రం గౌరవం లేదని కూటమి నేతలు వేలెత్తి విమర్శించగలుగుతారు.

తద్వారా వారిని ఎన్నుకొని తప్పు చేశామని 11 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ భావించేలా చేయగలరు.

కనుక జగన్‌ శాసనసభ సమావేశాలకు రాకుండా తప్పించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షహోదా సాకు చూపుతుంటే, సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే కారణంతో వారిని ప్రజల ముందు దోషులుగా, బాధ్యతారాహితమైన నేతలుగా నిలబెట్టి చూపుతున్నారు.

కనుక వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు హెచ్చరిక తొందరాపాటు కాదు వ్యూహాత్మకమే అని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories