నెల్లూరు రూరల్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అవుట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్‌!

YS_Jagan_Adala _Prabhakar_Reddyనెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పడంతో వెంటనే ఆయనా స్థానంలో మరొకరిని జగన్మోహన్ రెడ్డి సిద్దం చేశారు. ఆయనే వైసీపీ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులని వచ్చే ఎన్నికలలో ఎదుర్కోవాలంటే ఎవరిని బరిలో దించాలని రెండు రోజులు తర్జనభర్జనలు పడిన తర్వాత ఇవాళ్ళ సిఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. వచ్చే ఎన్నికలలో ఆయన శాసనసభకి పోటీ చేసి మంత్రి పదవి చేపట్టాలని కోరుకొంటున్నారు. కనుక ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.

ఈ సీటు కోసం ఆనం రామనారాయణ రెడ్డి తమ్ముడు ఆనం విజయ్‌ కుమార్‌ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. ఇటీవలే భార్యతో కలిసి తాడేపల్లికి వచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు కూడా. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ సీటుని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఖరారు చేశారు. కనుక రేపటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి సోదరులతో కత్తి యుద్ధాలు ప్రారంభించనున్నారు.

ADVERTISEMENT

ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టికెట్‌ ఆశిస్తున్నారు.

ఇక మాజీ మంత్రి పేర్ని నాని ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం? పార్టీలో ఉండాలనుకొనేవారు ఉంటారు. పోవాలనుకొనే ఎలాగూ పోతారు. ఆ మాత్రం దానికి నిఘా ఎందుకు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన స్నేహితుడు, కాంట్రాక్టర్ రామశివారెడ్డితో చేసిన ఫోన్‌ సంభాషణని ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే రామశివారెడ్డికి కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం. అందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడిన మాటలని తన ఫోన్‌లో రికార్డ్ చేసి వాటిని పార్టీలో అందరికీ సర్క్యూలేట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. అందరి ఫోన్లలో వాట్సప్ మెసేజులు చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు కనుక ముందుగా చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్‌ని కలిసి వచ్చాక ఈ అసత్య ఆరోపణలు చేశారు. వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. అవి కేవలం ఆయన స్నేహితుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సర్క్యులేట్ చేసిన రికార్డింగ్ మాత్రమే. ఒకవేళ ఇంతకి మించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద ఏమైనా బలమైన ఆధారాలు ఉన్నట్లయితే చెప్పాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories