సాధారణంగా ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు విదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ స్థిరపడిన ఎన్ఆర్ఐలను స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రాభివృద్ధికి యదాశక్తిన తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తుంటారు. ఎన్ఆర్ఐలు కూడా ఉడతా భక్తిగా తమ తమ రాష్ట్రాలలో అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కానీ ప్రవాస భారతీయులు ఏపీలో సమాజసేవ కార్యక్రమాలు చేపడితే వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మొన్న గుంటూరు జిల్లా ఉయ్యూరులో ఎన్ఆర్ఐ, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ సంక్రాంతి పండుగ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమం చేపడితే దానిలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం నాకూ చాలా బాధ కలిగించింది. అయితే ఆయన ప్రత్యర్ధి పార్టీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించడంతో ఈ ఘటనలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి ఇబ్బందిపెడుతున్నారు. మా పార్టీలో కొందరు ఆయన గురించి ఉన్నవీ లేనివీ కల్పించి నిందిస్తున్నారు.
అయితే ఉయ్యూరు శ్రీనివాస్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన చాలా మంచి మనిషి. నాకు మంచి మిత్రుడు. ఆయన గతంలో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎప్పుడూ పేదలకు సాయపడుతుంటారు. ఆయన ఎప్పుడూ అందరికీ సాయపడాలనే కోరుకొంటారే తప్ప తన వల్ల ఎవరికీ అపకారం జరగాలనుకోరు. మొన్న తన కార్యక్రమంలో తొక్కిసలాటలు జరిగి ముగ్గురు చనిపోయినందుకు ఆయన కూడా చాలా బాధపడ్డారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆర్ధికసాయం కూడా అందజేశారు.
పేదలకి సాయపడుతున్న అటువంటి మంచి మనిషిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆయన వంటి అనేకమంది ప్రవాస భారతీయులు రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు. రాష్ట్రానికి సేవ చేస్తున్న అటువంటి వారిని మనం గౌరవించుకోవాలి కానీ ఈవిదంగా రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టడం సరికాదు. మనం వారితో ఈవిదంగా ప్రవర్తిస్తుంటే ఇంకెవరూ ముందుకు రారు. ఉయ్యూరు శ్రీనివాస్ని వేధిస్తే అది ప్రవాస భారతీయులకి తప్పుడు సంకేతాలు పంపించిన్నట్లవుతుంది. అప్పుడు మరెవరూ ముందుకు రారు,” అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.



