ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తమ్ముడు నాగబాబుకి రాజ్యసభసీటు ఇప్పించుకునేందుకే ఢిల్లీ పెద్దలని కలిశారని వైసీపీ కనిపెట్టి చెప్పింది. కానీ నాగబాబుని రాజ్యసభకి పంపడం లేదు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.
నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటున్నందున తప్పనిసరిగా ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే సీట్లు ఖాళీ లేవు. కానీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చేయవచ్చు లేదా గవర్నర్ కోటాలో నామినేట్ చేయవచ్చు. కనుక నాగబాబు మంత్రి పదవి చేపట్టడం, ఎమ్మెల్సీ అవడం రెండూ లాంఛనప్రాయమే అని భావించవచ్చు.
టీడీపీ-జనసేన పార్టీల మద్య చిచ్చుపెట్టి పవన్ కళ్యాణ్ వేర్పడేలా చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం రెండు పార్టీల మద్య బంధాన్ని మరింత బలపరుస్తుందని వేరే చెప్పక్కరలేదు.
టీడీపీతో పొత్తులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాపులను చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టేశారనే వైసీపీ విమర్శలకు చెప్పుతో కొట్టిన్నట్లు సమాధానం చెప్పిననట్లు కూడా అయ్యింది.
కనుక ఇకపై కాపులను ఆకర్షించేందుకు, రెండు పార్టీల మద్య చిచ్చు పెట్టేందుకు జగన్ చేసే ప్రయత్నాలు, కుట్రలకు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారని చెప్పవచ్చు.
అయితే ‘ఆహా ఓహో..’ అని అనుకోవడానికి కూడా లేదు. కనీసం ఎమ్మెల్సీ కూడా కాని నాగబాబుకి నేరుగా మంత్రి పదవి కట్టబెట్టడంతో, దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్న పార్టీ సీనియర్ నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
వారు దీనిని జీర్ణించుకోవడం కష్టమే. కనుక వారిలో అసంతృప్తి మొదలవుతుంది. కనుక వారికి చంద్రబాబు నాయుడు సర్ధి చెప్పి ఏవిదంగా న్యాయం చేస్తారో చూడాలి.
ఇప్పుడు వైసీపీ కూడా మరో రకంగా దుష్ప్రచారం చేయవచ్చు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆడమన్నట్లు ఆడుతున్నారని దుష్ప్రచారం చేసేది. ఇకపై పవన్ కళ్యాణ్ ఆడమన్నట్లు చంద్రబాబు నాయుడు ఆడుతున్నారంటూ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టవచ్చు.
అలాగే టీడీపీ సీనియర్లకు చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారంటూ మొసలి కన్నీరు కార్చుతూ వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించకుండా ఉండదు.
కనుక ఇల్లు అలకగానే పండుగ అనుకోరాదు. ఇంటికి ఎవరూ నిపెట్టకుండా కాపాడుకోవడం కూడా చాలా అవసరమే.




