కెప్టెన్ గానూ, ఇటు బ్యాట్స్ మెన్ గానూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ధోని, తాజాగా జరిగిన టీ 20 మ్యాచ్ లోనూ అదే రకమైన ఆట తీరుతో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. ఓ పక్కన యువ ఆటగాళ్ళు మనీష్ పాండే, అక్సర్ పటేల్ లు లక్ష చేధనలో షాట్ల కోసం ప్రయత్నించి అవుట్ అవుతుంటే… మరో ఎండ్ లో ఉన్న ధోని మాత్రం సింగిల్స్ కోసం యత్నించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ధోని బ్యాటింగ్ తీరుపై క్రీడా విశ్లేషకులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్న తరుణంలో క్రీజులో ఉన్న ధోని మ్యాచ్ ను గెలిపించలేక చతికిలపడడమే ఈ ఆగ్రహనికి అసలు కారణం. 17 బంతులు ఎదుర్కొన్న ధోని కేవలం ఒకే ఒక బౌండరీని తరలించి 19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 171 లక్ష్య చేధనలో 53 పరుగులకే తొలి 3 వికెట్లను చేజార్చుకుని, పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను మనీష్ పాండే ఆదుకున్నాడు. మరో ఎండ్ లో కేదార్ జాదవ్ 19 పరుగులతో కాసేపు సహకారం అందివ్వగా, ఆ తర్వాత ధోనిని మరో ఎండ్ లో పెట్టుకుని జింబాబ్వే బౌలర్లపై ప్రతాపం చూపాడు పాండే.
ఓ భారీ షాట్ కు ప్రయత్నించి 35 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్సర్ పటేల్ మ్యాచ్ స్వరూపాన్ని టీమిండియా వైపుకు తిప్పాడు. కీలకమైన దశలో 9 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్ తో 18 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అవ్వడంతో టీమిండియా ఓటమి పాలయ్యింది. బహుశా అక్సర్ పటేల్ ఉన్నట్లయితే మ్యాచ్ భారత్ వైపుకు మలుపు తిరిగేదేమో అన్నంతగా మ్యాచ్ లో ప్రభావం చూపాడు. పటేల్ ఔటైన తర్వాత వచ్చిన ధావన్, అప్పటికే క్రీజులో ఉన్న ధోనిలు బాల్ ను బ్యాట్ తో కనెక్ట్ చేయడానికే ఇబ్బంది పడ్డారు.
మొత్తానికి పసికూన జింబాబ్వే జట్టు టీమిండియాకు గట్టి షాక్ ఇచ్చింది. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియాకు రివేంజ్ రుచి ఏంటో చూపించింది. అంతకు ముందు టాస్ గెలిచి జింబాబ్వేకు బ్యాటింగ్ అప్పగించిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో చిగుంబర 26 బంతుల్లో 7 సిక్సర్లు, 1 ఫోర్ సహాయంతో 54 పరుగులు చేసి 170 పరుగుల భారీ స్కోర్ కు కారణమయ్యాడు.



