ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్ధులను సౌమ్యులు, అమాయకులు, నిజాయితీపరులు, ఆణిముత్యాలు అంటూ ప్రజలకు పరిచయం చేశారు.
వారు మరీ అంత అమాయకులు, సౌమ్యులు కనుకనే ఎన్నికలలో ఓడిపోయారేమో?అనే సందేహం అలాగే ఉండిపోయింది.
వారు అంత అమాయకులు, సౌమ్యులు కనుకనే ఇప్పటికీ పోలీస్ కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారేమో? అనే సందేహం కూడా ఉంది.
వైసీపీ నేతలు అందరూ అంత అమాయకులు కనుకనే చివరికి ఈడీకి కూడా అలుసైపోయారేమో అనిపిస్తుంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ మళ్ళ విజయ్ ప్రసాద్కు చెందిన హైదరాబాద్, విశాఖతో సహా 5 ప్రాంతాలలో ఇళ్ళు, కార్యాలయాలలో నేడు ఈడీ బృందాలు సోదాలు చేశాయి.
దీనిలో ఆంధ్రాతో పాటు, తెలంగాణ, ఓడిశా రాష్ట్రాలకు చెందిన ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు. వెల్ఫేర్ గ్రూప్ చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్ సంస్థలలో మూడు రాష్ట్రాలలో సామాన్య ప్రజలకు సుమారు రూ. 3,000 కోట్లు కుచ్చుటోపీ పెట్టారని ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది.
ఆయన చాలా మంచివాడు, సౌమ్యుడు అని జగన్ చెప్పినా ఈడీ అధికారులు నమ్మకుండా సోదాలు నిర్వహించి అభాండాలు వేయడం చాలా బాధాకరం.
అలాగే కాకినాడలో సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేసిన మంచితనం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సొంతం. కానీ పాపం.. ఆయనకి హైకోర్టు బెయిల్ ఇవ్వడం లేదు. ఆయన చాలా మంచివాడు, సౌమ్యుడు అని జగన్ చెప్పినా కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా బాధాకరమే.
శ్రీకాకుళం అమాయకులు, సౌమ్యుల బ్యాచ్లో దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులున్నారు.
పాపం వారు కూడా అమాయకత్వం వలన పోలీసు కేసులలో చిక్కుకుంటూనే ఉన్నారు. వారిలో దువ్వాడ కపుల్ ఒకటే హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ హాయిగా గడిపేస్తోంది. అదీ జగన్కు నచ్చడం లేదు.
ఇంకా ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గోరంట్ల మాధవ్, కాకాణి గోవర్ధన్… ఇలా వైసీపీ నిండా చాలా మంది అమాయకులు, సౌమ్యులు పోగుపడ్డారు.
అలాంటి అమాయకులను వెంటపెట్టుకొని గత ఎన్నికలలో ఓడిపోయిన అమాయక చక్రవర్తి జగన్, వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని చెప్తున్నారు. మరీ ఇంత అమాయకత్వం పనికి రాదేమో?




