బీజేపీ ది డబుల్ ‘ఇంజన్’ ఆ డబుల్ ‘గేమా’..?

AP BJP

బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలాలని భావిస్తుంది. అందుకు గాను వై నాట్ 400 అంటూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ఒక్కో రాష్ట్రాన్ని కమల వనంగా మార్చే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో భాగమై ఎన్నికల బరిలో నిలిచింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ వ్యూహాలు ఏమిటో అర్ధం కాకా అటు మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఏపీలో ఎటువంటి ప్రజాబలం లేని బీజేపీ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్న ఇదే వాస్తవం. అధికారంలో ఉన్న వైసీపీ ని ఒక చంకలో, ఇటు కూటమిలో భాగమై మిత్రపక్షాలుగా మారిన టీడీపీ, జనసేనలను మరో చంకలో కూర్చుపెట్టుకుని రాజకీయ క్రీడ మొదలుపెట్టింది.

ADVERTISEMENT

ఒకసారి వైసీపీ ని కిందకు దింపి కూటమిని పైకి లేపుతుంది. అలాగే మరోసారి కూటమి పార్టీలను కింద పడేసి ప్రత్యర్థి అయినా వైసీపీ కి మేలు చేస్తుంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ పై ఫ్రీ సింబల్ అంటూ మొదలైన రచ్చకు అసలు కారణం ఎవరు..?

ఒక వేళ అది రచ్చయితే దాని పరిష్కారానికి మార్గం చూపాల్సింది ఎవరు..? పొత్తు అంటూ మిత్రధర్మం పేరిట జనసేనకు వచ్చిన సీట్లను కూడా తన ఖాతాలో వేసుకున్న బీజేపీ జనసేనకు, కూటమికి వ్యతిరేకంగా ఇంత అన్యాయం జరుగుతున్నా మోనంగా ఉండడం వెనుక ఉన్న ఆ సవతి ప్రేమ ఎవరి కోసం..? అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు చెవులు కోరుకుంటున్నారు. షర్మిల చెప్పినట్టు మోడీ దత్తపుత్రుడి గెలుపు కోసమా..? అనే చర్చ కూడా ఊపందుకుంది.

ఒక పక్క ఆ చర్చ నడుస్తూ ఉండగానే ఇప్పుడు వైసీపీ కి మరో అస్త్రాన్ని అందించింది బీజేపీ. దీనితో అసలు బీజేపీ ది స్నేహ హస్తమా..? లేక దృతరాష్ట్రుడి కౌగిలి అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈరోజు కూటమి మానిఫెస్టో విడుదల సందర్భంలో బీజేపీ ఇంచార్జ్ సిద్దార్ధ్ నాధ్ చేసిన పనికి అప్పుడే వైసీపీ కూటమి మేనిఫెస్టో పై దుష్ప్రచారం మొదలుపెట్టింది.

టీడీపీ, జనసేన కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి మేనిఫెస్టో కు బీజేపీ సహకారం ఉంటుంది అంటూ బాబు, పవన్ లు కూటమి మేనిఫెస్టో ను మీడియా ముందుకు తీసుకు వచ్చారు. అయితే ఈ సందర్భాల్లో బీజేపీ నేత సిద్దార్ధ్ ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి అయిష్టంగా వ్యవహరించడంతో ఇక వైసీపీ తనదైన స్టైల్ లో రెచ్చిపోయింది.

బాబు విడుదల చేసిన మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ నేతలు సుముఖత చూపడం లేదు, అలాగే వారు విడుదల చేసిన మేనిఫెస్టో మీద కుడా బాబు, పవన్ చిత్రాలే కానీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టలేదు, అంటే కూటమికి బీజేపీ పెద్దల ఆశీస్సులు లేనట్టే అంటూ టీడీపీ పై ఎదురుదాడి మొదలుపెట్టింది.

అయితే దీనికి కౌంటర్ గా టీడీపీ కూడా కూటమి మేనిఫెస్టో కు బీజేపీ సహకారం ఉంటుంది అంటూ సిద్దార్ధ్ మాటాడిన వీడియో ను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కూటమి పార్టీలకు బలంగా ఉండాల్సిన బీజేపీ ఇలా ప్రత్యర్థికి అస్త్రాలు అందించడం, టీడీపీ, జనసేనలు వాటి పదును తగ్గించడానికి కౌంటర్లను సిద్ధం చేయడం అవసరమా.? అసలు బీజేపీ ‘ది డబుల్ ఇంజన్’ ప్రణాళికా..? లేక ‘డబుల్ గేమా’..? అంటూ పలు అనుమానాలు టీడీపీ, జనసేన కార్యకర్తలను చుట్టుముడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories