రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు అనేది కాదనలేని సత్యం.గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన పలువురు నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు.తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ కూడా ఒకప్పుడు సోనియా గాంధీ భజన బృందం సభ్యుడే అనేది మరిచినట్టున్నారు.
పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు, పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్ గత టీడీపీ ప్రభుత్వ లోపాలను ఎన్నడూ విమర్శించలేదు అంటూ మీడియా ముందు నోరుపారేసే వైసీపీ నేతలు ఇప్పుడు తమ విమర్శలలో వాస్తవం లేదని వారే ఒప్పుకుంటూన్నారు. టీడీపీ జనసేన పొత్తుతో కన్ఫ్యూషన్ లో పడ్డ వైసీపీ ఇప్పుడు మరో కొత్త వాదనను తెర మీదకు తెచ్చింది. గత ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శించలేదు అన్న నోటితోనే ఇప్పుడు పవన్ టీడీపీ ప్రభుత్వం పైన చేసిన విమర్శలను తెర పైకి తెచ్చారు.
గతంలో చంద్రబాబుని తప్పుబట్టిన పవన్ ఇప్పుడెలా బాబుకి మద్దతు పలుకుతారు అంటూ కొత్త రాగం అందుకున్నారు. ఒకసారి పవన్, బాబుని విమర్శించలేదు అంటారు మరో సారి గతంలో విమర్శించి ఇప్పుడెలా కలుస్తావు అంటారు. ఇలా రెండు నాలుకల ధోరణితో వైసీపీ నేతలు ప్రజలలో చులక అవుతున్నారు అనే విషయాన్ని గుర్తించే స్థితిలో లేరు. రాజకీయాలలో ఏ రెండు పార్టీల మధ్య అయినా పాలసీ పరమైన విభేదాలు చోటు చేసుకోవడం సహజమే.
పాలసీ పరమైన విమర్శలకు వ్యక్తిగత విమర్శలకు తేడా తెలియని నేతలు ప్రభుత్వాలు నడుపుతుంటే రాష్ట్రంలో రాజకీయ వేధింపులే మిగులుతాయి అనేది వైసీపీ ప్రభుత్వ పాలనను తీరుకి అద్దంపడుతుంది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలలో సింహ భాగం నేతలు పక్క పార్టీ నుంచి గోడ దూకిన వారే. కాంగ్రెస్ పార్టీ తమకు ద్రోహం చేసింది అంటూ జగన్ ఫామిలీ ఆంధ్ర రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి ఆంధ్రలో అధికారం సంపాదించారు.
తెలంగాణాలో పార్టీ స్థాపించిన షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీ పై మనసు మార్చుకుని సోనియా గాంధీ కుటుంబాన్ని కొనియాడుతూ తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సన్నాహం అయ్యారు. ఇవన్నీ వైసీపీ పార్టీ నేతలకు కనపడవా? వినపడవా?వాటి గురించి మాట్లాడారా? రాజకీయాలలో ఎప్పుడు ఏంజరుగుతుందో ఊహించడం కష్టం అనే వాదనను తన సోదరి షర్మిల ప్రకటనతోనే రుజువయ్యింది కానీ వైసీపీ నేతలకు అవి పట్టవనుకుంటా!



