‘బాహుబలి 2’ తర్వాత బాలీవుడ్ కు భారీ జలక్ లు తగిలాయి. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా పెద్దగా ప్రయోజనం లేకపోయాయి. వరుసగా దారుణ పరాజయాలు పలకరిస్తున్న నేపధ్యంలో… గతేడాది ఫైనల్ కిక్ ఇచ్చేందుకు సల్మాన్ “టైగర్ జిందా హై” రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ డే నుండే బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న ఈ సినిమా కలెక్షన్స్, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్ లో చేరనుంది.
ఓవర్సీస్ లో 110 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ కండల వీరుడు సినిమా, ఇండియన్ మార్కెట్ లో 380 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. అలాగే నెట్ పరంగా ఇండియా లెక్కలు 295 కోట్లుగా తేలాయి. మొదటి 15 రోజుల్లో వచ్చిన ఈ లెక్కలను అంచనా వేస్తున్న ట్రేడ్ పండితులు, వరల్డ్ వైడ్ గా 500 కోట్లు సాధించడం లాంచనమే గానీ, ఒక్క ఇండియాలో 500 కోట్ల గ్రాస్ ను అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నెట్ పరంగా 300 కోట్లను చేరుకోవడం ఖాయం కాగా, గ్రాస్ పరంగా 400 కోట్లల్లో నిలవడానికి ఎక్కువ రోజులు సమయం పట్టకపోవచ్చు.
గతేడాది ఈద్ కు “ట్యూబ్ లైట్” సినిమాతో అభిమానులను నిరుత్సాహపరిచిన సల్మాన్, ఇయర్ ఎండ్ కు “టైగర్ జిందా హై” రూపంలో అదిరిపోయే గిఫ్ట్ ను అందించాడు. అలాగే చాలాకాలం నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అందాల బొమ్మ కత్రీనా కైఫ్ కు కూడా మరోసారి బ్రేక్ ఇచ్చాడు సల్మాన్. కెరీర్ తొలినాళ్ళ నుండి కత్రీనాకు బ్రేక్స్ ఇవ్వడంలో సల్మాన్ పోషిస్తున్న పాత్ర తెలియనిది కాదు. మొత్తానికి ‘బాహుబలి 2’ తర్వాత చెప్పుకోవడానికి బాలీవుడ్ కు ఒక సినిమా లభించింది.



