ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, కుటుంబ సభ్యుల మరణాలకు కారకులైన వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ శపధం చేశారు. అదేదో నోటి మాటగా చెప్పలేదు. సోషల్ మీడియాలో ఓ సందేశం ద్వారా ప్రకటించారు.
ఇది తన ఒక్కడి ప్రతీకారమే కాదని యావత్ దేశ ప్రజల ప్రతీకారమన్నారు. మా నాయకులను, వారితో పాటు అమరులైన ప్రతీ ఒక్కరి కోసం ఆ హంతకులపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
అయితే తనను లేదా తన అధికారులను అంతం చేసినంత మాత్రాన్న ఈ ప్రతీకార చర్య నిలిచిపోదని స్పష్టం చేశారు. ఒకవేళ తనని లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు చేస్తే ఈసారి ప్రతీకార దాడులు మరింత భీకరంగా ఉంటాయని మొజ్తబా ఖమేనీ ఆ సందేశంలో చెప్పారు.
ఇదే ముక్క ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికా చెవిలో వేసి డోనాల్డ్ ట్రంప్ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండమని హెచ్చరించాయి. ఈ యుద్ధం దీర్గాకాలం సాగవచ్చు సాగక పోవచ్చు. కానీ ఏదో ఒకరోజు ముగుస్తుంది.
ఒకవేళ మొజ్తబా ఖమేనీ చెప్పినట్లుగా అమెరికా దళాలు ఆయనని కూడా అంతం చేసినా ఇరాన్ నాయకత్వం చేపట్టేవారు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండరు. ఎందుకంటే అమెరికా దాడితో పోయిన పప్రాణాల కంటే వారి హృదయాలకు అయిన గాయం చాలా పెద్దది. వారి దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగింది. వీటిని భరించడం చాలా కష్టం.
ఒకవేళ భరించినా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనం చేస్తే వారిలో ఈ ప్రతీకారేచ్చ మరింత రగులుతుంది తప్ప చల్లారదు.
కనుక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దుందుడుకుతనంతో ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళి తాను స్వయంగా ఇలాంటి ప్రమాదంలో పడటమే కాకుండా అమెరికాని కూడా ప్రమాదంలోకి నెట్టారని చెప్పక తప్పదు.
అయితే అమెరికాకు ఇలాంటి సవాళ్ళు, ప్రమాదాలు కొత్తేమీ కాదు. గతంలో బిన్ లాడెన్ ద్వారా ఒకసారి ఎదురుదెబ్బ తింది. తర్వాత అతనిని మట్టుబెట్టింది.
ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని మట్టుబెట్టింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం కమాండర్ని మట్టు బెట్టింది. కనుక అమెరికా ఇలాంటి సమస్యలను, సవాళ్ళను కొని తెచ్చుకున్నా సిద్ధంగానే ఉంటుంది. కాకపోతే దానికి అది ఎంత మూల్యం చెల్లిస్తోందనేదే ప్రశ్న.




