వైసీపీ అధినేత జగన్ కావచ్చు.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కావచ్చు లేదా మరో పార్టీ రాజకీయ నాయకుడో కార్పొరేటరో కావచ్చు… రాజకీయాలలో ఉన్నవారందరికీ పోలీసులంటే చులకనే.
ఒకరు పోలీసుల గుడ్డలూడదీయించి నిలబెడతామంటారు.. మరొకరు పోలీసులనే బూతులు తిడతారు లేదా దాడి చేస్తారు. అధికార పార్టీ నేతలైనా ప్రతిపక్ష నేతలైనా వారిని చూసి పోలీసులు భయపడాల్సిందే. కానీ ఆ పోలీసులే వారికి భద్రత కూడా కల్పించాలి!
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఒకప్పుడు కదిరి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసినవారే. కనుక ఆయనకు పోలీసులపై ఎటువంటి ఒత్తిళ్ళు ఉంటాయో బాగా తెలుసు. కనుక పోలీసులకు సహకరించాలి. కానీ పోలీసులపై దాడి చేశారు.
ఆ కేసులో అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఓవర్ యాక్షన్ చేశారు. వైద్య పరీక్షలకని గుంటూరు జీజీ హాస్పిటల్కు తీసుకువెళుతుంటే అక్కడా ఓవర్ యాక్షన్ చేశారు. కోర్టుకి తీసుకువెళుతుంటే అక్కడ ఓవర్ యాక్షన్ చేశారు.
ఆయన ఓవర్ యాక్షన్ వలన ఏకంగా 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వారిలో ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఒక మాజీ ఎస్సై వలన 11 మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ సస్పెండ్ అవడం చాలా బాధకరమే కదా?
గతంలో ఆయన ఎస్సైగా ఉన్నప్పుడు ఇలాగే ఓవర్ యాక్షన్ చేసి జగన్ కంట్లో పడి వైసీపీలో చేరి చకచకాపైకి ఎదిగారు. కనుక ఇప్పుడూ జగన్ మెప్పు కోసమే ఇలా ప్రజలు, పోలీసులు, మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు.
గోరంట్ల మాధవ్ ఎంపీ స్థాయికి ఎదిగినందున తాను ఒకప్పుడు ఎస్సైగా చేశానని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడక పోవచ్చు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇంత మంది బలవుతారనే వివేకం ఉండాలి కదా?




