శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం త్రొక్కిసలాట జరిగి 9 మంది మహిళలు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఇది కార్తీక మాసం… నేడు ఏకాదశి కావడంతో రాష్ట్రంలో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
కాశీబుగ్గలో స్వామివారి ఆలయానికి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఈరోజు చాలా మంది భక్తులు తరలి వస్తారని ఆలయ నిర్వాహకులకు ముందే తెలిసి ఉన్నప్పటికీ పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో భక్తుల రద్దీ పెరిగినప్పుడు తోపులాటలో స్టీల్ రెయిలింగ్ ఊడి పడిపోయింది. దానిని ఆనుకొని ఉన్న పలువురు కింద పడిపోయారు.
కానీ క్యూలైన్లో వెనుకనున్న భక్తులకు ఈ విషయం తెలియకపోవడంతో క్యూలైన్లో ఒత్తిడి పెరిగి త్రొక్కిసలాట జరిగింది. వెంటనే ఆలయ సిబ్బంది, పోలీసులు క్యూలైన్లలో ఉన్న భక్తులను నియంత్రించి గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ త్రొక్కిసలాటలో గాయపడిన మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
నేడు ఏకాదశి కావడంతో చాలా మంది మహిళలు ఎంతో నిష్టతో ఉపవాసం చేస్తూ ఆలయాలకు వెళ్ళి దేవీదేవతలను దర్శించుకుంటారు. కానీ ఈవిదంగా త్రొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. కానీ ఈ విషాద ఘటనపై రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయకుండా సంయమనం పాటిస్తే మంచిది.







