“సరైనోడు” సినిమా తర్వాత హీరో ఆది ఫేట్ మారిపోయినట్లుగా కనపడుతోంది. అలా అని వచ్చిన ప్రతి అవకాశాలను ఎంపిక చేసుకోకుండా “నిన్ను కోరి” వంటి అరుదైన సబ్జెక్ట్ లను చేస్తూ… సక్సెస్ లను అందుకుంటున్న ఆది, ప్రస్తుతం పవర్ స్టార్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మరియు సుకుమార్ – రామ్ చరణ్ ల చిత్రంలో నటిస్తున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్, మరో పక్కన రామ్ చరణ్ చిత్రాలలో ఒకేసారి నటిస్తున్న ఆది అనుభూతులను తాజాగా పంచుకున్నారు.
“రంగస్థలం”లో తాను చేస్తున్న పాత్ర పూర్తి విభిన్నమైనదని, నా హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, నటన అన్ని వినూత్నంగా ఉంటాయని, పీరియాడిక్ డ్రామా కావడంతో అందుకు తగ్గట్లుగానే ఉంటుందని చెప్పిన ఆది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తన పాత్ర కార్పొరేట్ స్టైల్ తరహాలో ఉంటుందని, ఈ రెండూ వేటికవే విభిన్నంగా ఉంటాయని, ఒకేసారి ఇలా రెండు విభిన్న పాత్రలు చేయడంపై తనకే ఓ డౌట్ ఉందని, అయితే దర్శకుడు త్రివిక్రమ్, సుకుమార్ లు తన పనిని చాలా తేలిక చేస్తున్నారని తెలిపారు.
మరో విశేషం ఏమిటంటే… ఆది నటిస్తున్న ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాబాయ్ – అబ్బాయ్ సినిమాలలో ఏది సక్సెస్ సాధించినా… రెండూ సక్సెస్ అయినా… 2018 సంక్రాంతి పర్వదినం ఆది కెరీర్ కు కీలక మలుపు కాబోతుందన్న మాట.


