‘పీఎస్వీ గరుడవేగ’ సినిమా ద్వారా ప్రశంసలు అందుకుంటున్న హీరో రాజశేఖర్ కు కుటుంబ పరంగా గడిచిన కొంతకాలం నుండి గడ్డు పరిస్థితులను చవిచూస్తున్నారు. తన తల్లిని కోల్పోవడంతో పాటు, స్వయంగా ఓ యాక్సిడెంట్ చేయగా, అలాగే ఇటీవల బావమరిదిని కూడా కోల్పోయారు. ఈ తరుణంలో ‘గరుడవేగ’ సక్సెస్ రాజశేఖర్ కుటుంబానికి కాస్తంత ఉపశమనం ఇవ్వగా, అది ముగియక ముందే మరో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.
త్వరలో హీరోయిన్ గా తెరంగ్రేటంకు సిద్ధమవుతున్న రాజశేఖర్ తనయురాలు శివానిపై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవనిర్మాణనగర్ వైపు వెళ్తూ స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టారు. ప్రమాదం కారణంగా కారు చాలా వరకు పాడైంది.
ఈ ఘటనపై ఎస్పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. శివానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినా కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు.





