కవితా లక్ష్మి… మలయాళ టీవీ నటి. సీరియల్స్ లో నటిస్తున్న ఈమె సంపాదన కుటుంబానికి సరిపోకపోవడంతో… ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టిన వేళ ఏం చేయాలి? ఒక పని చేసే వాళ్లు మరో పనిని చేయడం మొదలు పెట్టాలి. తద్వారా ఇంకాస్త ఎక్కువ సంపాదించి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఇదే ఆలోచించిన కవితా లక్ష్మి రాత్రి వేళల్లో రోడ్డుపక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుంది. పెనంపై దోశలు వేస్తూ, వాటిని అమ్ముకుంటూ అదనపు డబ్బు సంపాదిస్తూ, కష్టపడుతోంది.
మలయాళం సూపర్ హిట్ సీరియల్ ‘స్త్రీ ధనం’లో ఆమె వేసిన శాంత పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తాను ఒంటరిగా ఉంటూ ఓ పాప, బాబును చూసుకుంటున్నానని ‘మనోరమా ఆన్ లైన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. తన కుమారుడిని పై చదువుల నిమిత్తం బ్రిటన్ పంపి ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పింది. అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి గంటకు 10 పౌండ్లు సంపాదించవచ్చని మధ్యవర్తులు చెప్పిన మాట నమ్మి మోసపోయానని తెలిపింది.
ఇప్పుడు తానే చదువుకు అవసరమయ్యే ఫీజులు పంపాల్సి వుందని, అందువల్లే ఇలా హోటల్ నడుపుతున్నానని చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సీరియల్స్ ఉన్నాయని, అ డబ్బుతో పాటు, హోటల్ ద్వారా సంపాదించే డబ్బునూ కుమారుడికి పంపుతున్నట్టు చెప్పింది. కాగా, ఈ హోటల్ నెయ్యత్తినకరా పరిధిలోని నిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉండగా, స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది.


