విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్నారంటూ ప్రముఖుల పేర్లనూ వెల్లడించి ‘పనామా పేపర్స్’ సృష్టించిన సంచలనం తెలిసిందే. తొలి విడతలో అమితాబ్, ఐశ్వర్యరాయ్ పేర్లతో పాటు, మలివిడతలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పేర్లను ప్రకటించి బాలీవుడ్ వర్గాలతో పాటు, పొలిటికల్ సునామీకి కారణమైన ‘పనామా పేపర్స్’లో తాజాగా మరో బాలీవుడ్ జంట పేరు తెరపైకి వచ్చింది.
ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’ జంట అజయ్ దేవ్ గణ్, కాజోల్ జంట విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్నారంటూ పనామా ఆరోపణలు చేసింది. బ్రిటన్ లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థలో అజయ్ దేవ్ గణ్ తన కంపెనీ ‘నిసా యుగ్ ఎంటర్టైన్మెంట్’ పేరిట దాదాపు 1000 షేర్లు కొనుగోలు చేసారని, ఈ సంస్థలో అజయ్ భార్య కాజోల్ కూడా ఉన్నారని తెలిపింది.
2013లో డైరెక్టర్ గా ఉన్న అజయ్ 2014లో రాజీనామా చేసారని, నిబంధనలకు విరుద్ధంగా ఈ పెట్టుబడులు జరిగాయని ఆరోపణలు చేయగా, తానూ పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవమేనని, అయితే అవన్నీ ఆర్బీఐ మార్గదర్శకాల మేరకే ఉన్నాయని, దీనికి చట్ట ప్రకారం చెల్లించాల్సిన పన్నులను కూడా చెల్లించానని అజయ్ దేవ్ గణ్ ఆరోపణలను ఖండించారు.



