టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటి వినియోగం ఏ మేరకు పెరుగుతుందో అలాగే దాని దుర్వినియోగం కూడా అదే స్థాయిలో కోరలు చాస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తరచూ సైబర్ నేరాల పరిధి పెరుగుతూ పోతుంది.
ఒకప్పుడు వీధి చోరీల బారిన పడిన ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా చోరీలతో అల్లాడుతున్నారు. అయితే ఈ సైబర్ నేరాల మీద ఇప్పటికి స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా యూజర్స్ లో చాల మందికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం సైబర్ నేరగాళ్ళకు మంచి అవకాశంగా మారుతుంది.
క్షణాలలో మన డేటా మొత్తం వారి చేతిలో వెళ్లిపోవడం, ఒక్క క్లిక్ బైట్ తో మన బ్యాంకు ఆకౌంట్ లో మనీ మొత్తం సైబర్ నేరగాళ్ల ఖాతాలలోకి చేరిపోవడం ఇలా అనేక సంఘటనలు నిత్యం వార్తలలో దర్శనమిస్తూనే ఉంటున్నాయి.
అలాగే డీప్ ఫీక్ వీడియోలతో కొందరు, స్మార్ట్ ఫోన్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం మొత్తం నిముషాలలో సోషల్ మీడియాలో ప్రసారం చేస్తూ మరికొందరు ఇలా నిత్యం ఎదో ఒకో రకంగా ఈ సైబర్ నేరగాళ్లు సామాన్యుల పై తమ నేర పంజా విసురుతూనే ఉంటున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం ఈ సైబర్ నేరాల మీద అవగాహన అవసరం అంటూ పేర్కొన్నారు. అలాగే తన సొంత కుమార్తె కూడ ఈ సైబర్ నేరగాళ్లు వేధింపులు ఎదుర్కొంది అంటూ చెప్పుకొచ్చారు.
తన కుమార్తె ఆన్ లైన్ గేమింగ్ ఆడుతున్న సమయంలో ఒక అపరిచితుడు పరిచమయ్యి ఆమె వివరాలు తెలుసుకుని, తన నగ్న చిత్రాలు పంపాలని కోరాడని, అయితే వెంటనే తన కుమార్తె ఆ ఆన్ లైన్ గేమ్ ఆపేసి ఆ విషయాన్ని తన తల్లికి చెప్పిందంటూ అక్షయ్ సైబర్ నేరాలు ఎలా ఉంటున్నాయని దానికి తన కుటుంబంలో ఎదురయినా చేదు సంఘటనను సాక్ష్యంగా చూపించారు.
అలాగే పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచే ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడం అవసరమంటూ, ప్రతి తరగతి గదులలోను విద్యార్థులకు ఎదో ఒక సమయంలో ఈ సైబర్ పీరియడ్స్ ఉండాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ని కోరారు.
అక్షయ్ అభ్యర్థన సమంజసమే అనే భావన సర్వత్రా వినిపిస్తుంది. విద్యార్థి దశ నుండి కూడా ఈ సైబర్ నేరాల మీద పూర్తి అవగాహాన కల్పించడం భవిష్యత్ సమాజానికి శ్రేయస్కరం. అలాగే ప్రభుత్వాలు ఆ దిశగా విద్యా వ్యవస్థలో ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం వారి విధిగా భావించాలి.




