వైసీపీలో మరో వికెట్ పడబోతోందా?అంటే అవుననే అనుకోవచ్చు. ఏలూరు జిల్లా, దెందులూరు వైసీపీలో సీనియర్ నేత, జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి ఈరోజూ మీడియా ముందుకు వచ్చి దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను తామందరం కలిసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అహంభావం ప్రదర్శిస్తూ తమపైనే పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
అబ్బయ్య చౌదరి పేరుకి దెందులూరు ఎమ్మెల్యే అయినా స్థానికంగా ఉండేది తక్కువ విదేశాలలో ఉండేది ఎక్కువన్నారు. అబ్బయ్య చౌదరి విదేశాలలో కూర్చొని దెందులూరులో రాజకీయాలను నియంత్రిస్తుంటారని ఆరోపించారు. స్థానికంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఎప్పుడూ విదేశాలలోనే ఉంటుండటంతో, ఇక్కడ నియోజకవర్గంలో ఆయన పేరు చెప్పుకొని అనుచరులు పెట్రేగిపోతున్నారని ఆరోపించారు. ఆయన అనుచరులు భూకబ్జాలు, ఇసుక, మట్టి మాఫియా, మినీ క్యాసినోలు, కోడి పందేలు నిర్వహిస్తూ వైసీపీ పరువు మంటగాలిపేస్తున్నారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నామనే అహంకారంతో విర్రవీగుతున్న మా ఎమ్మెల్యేని, ఆయన అనుచరులను చూసి జిల్లాలో ప్రజలు మమ్మల్ని కూడా అసహ్యించుకొంటున్నారు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మనకి అవసరమా? అని నరసింహ మూర్తి ప్రశ్నించారు.
ఇలాంటి ఎమ్మెల్యే కోసం ఇకపై తాను పనిచేయనని, వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే ఈసారి 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని ఆలపాటి నరసింహమూర్తి హెచ్చరించారు. కనుక ఈసారి ఎన్నికలలో అబ్బయ్య చౌదరిని మార్చాల్సిందేనని లేకుంటే వైసీపీ కోసం పనిచేయలేనని తేల్చి చెప్పేశారు.
వైసీపీ నేతలు, వారి అనుచరుల తీరు ఏవిదంగా ఉందో ఏలూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి స్వయంగా వివరించారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయమే. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పినందుకు నేడో రేపో వేటు పడే అవకాశం ఉంది.
బహుశః ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ త్వరలోనే ఏలూరు జిల్లాలో అడుగుపెడతారు. ఆలపాటి నరసింహమూర్తి టిడిపిలో చేరేందుకు బహుశః అదే ముహూర్తం కావచ్చు.



