జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో ఏపీలో వివిద వ్యవస్థలను, వివిద రంగాలను ఎంతగా దెబ్బ తీశారో వాటి దుష్పరిణామాలను అనుభవిస్తున్నవారికే తెలుసు. పాలనలో విఫలమైతే ఎన్నికలలో ప్రభుత్వాలను మార్చుకునే వెసులుబాటు ఉంది. కానీ రాష్ట్ర రాజకీయాలను కూడా జగన్ కలుషితం చేయడంతో దాని పర్యావసనాలను ఆయన, వైసీపితో సహా అన్ని పార్టీలు, వాటి నేతలు కూడా అనుభవించాల్సి వస్తోంది.
రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని అనేక కుట్రలు చేశారు. కుదిరితే తనను జైల్లోనే చంపేయాలని జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, కానీ తాను ధైర్యంగా, నిబ్బరంగా ఉండటంతో ఆ సాహసం చేయలేకపోయిందని చంద్రబాబు నాయుడు స్వయంగా నిన్న ఏబీఎన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయన చెప్పిన ప్రతీ మాటని నమ్మనవసరం లేదు. కానీ ఆయనపై కక్ష కట్టి జైల్లో నిర్బందించడం నిజమే కదా? ఆయనతో పాటు టిడిపి ముఖ్య నేతలపై కేసులు పెట్టి జైలుకి పంపించాలని ప్రయత్నించడం నిజమే కదా? సొంత చెల్లెలిపై కూడా పార్టీ నేతల చేత విమర్శలు చేయించడం, ఆమె కట్టుకున్న చీర గురించి జగన్ మాట్లాడటం అందరూ విన్నారు కదా?
వైఎస్ షర్మిల కూడా తన అన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం ఏవిదంగా ఉంటుందో చెపుతూ, “రాష్ట్రంలో వైసీపి ‘సింగిల్ ప్లేయర్’గా ఉండాలనుకుంటోంది. అలాగైతే మీ రాజకీయ ప్రత్యర్ధులు అందరినీ గొడ్డలితో నరికేయండి. ఇక రాష్ట్రంలో వైసీపికి ఎవరూ పోటీ ఉండరు,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకోవడంతో వారి బాధ్యత పూర్తవుతుంది. కానీ రాష్ట్రంలో రాజకీయాలను జగన్ కలుషితం చేయడం వలన ఒక్కటిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రజలు రెండుగా చీలిపోయారు.
అదృష్టవశాత్తు ‘మూడు రాజధానులు’ ఉచ్చులో ప్రజలు చిక్కుకోలేదు. లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ మూడు ముక్కలయ్యేది. విశాఖ రాజధాని కాకపోతే మరోసారి రాష్ట్ర విభజన తప్పదని రెవెన్యూ మంత్రి హోదాలో ఉన్న ధర్మాన ప్రసాదరావు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
రాష్ట్ర రాజకీయాలను ఇంతగా కలుషితం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సహించలేకపోవడం, ప్రశ్నించినవారిని వారి కుటుంబ సభ్యులను కూడా బజారుకీడ్చే విష సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ముమ్మాటికి వైసీపి దాని అధినేత జగన్మోహన్ రెడ్డే.
ఇందుకు తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరూ అతీతులు కారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బ్రాహ్మణి, చిరంజీవి, రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ వీరందరూ కూడా వైసీపి బాధితులే. చివరికి సీబీఐ కూడా వైసీపి బాధితురాలే.
జగన్మోహన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించినా, విమర్శించినా వారందరినీ ఆటోమేటిక్గా ‘దుష్టులు, దుర్మార్గుల జాబితాలో చేర్చేసే’ సాఫ్ట్వేర్ వైసీపి ఏర్పాటు చేసుకుంది.
చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ని గెలిపించమని అడిగినందుకు పోసాని కృష్ణ మురళి ఎంతగా నోరు పారేసుకున్నారో అందరూ చూశారు.
జగన్ ప్రభుత్వం అవమానించిన ఆ చిరంజీవే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు అందుకోబోతున్నారు. తెలుగు ప్రజలు అందరూ గర్వపడే నటుడు చిరంజీవి. ఆయన అంత గౌరవం అందుకోబోతుంటే జగన్ ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన గౌరవం ఏమిటంటే పోసాని చేత నోటికి వచ్చిన్నట్లు తిట్టించడం!
తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే అందరినీ శత్రువులుగా మార్చుకుని అహంకారంతో విర్రవీగినందుకు బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఆయననే గుడ్డిగా నమ్ముకున్న పార్టీ నేతలు నష్టపోయారు. ఏపీలో జగన్ కూడా అదేవిదంగా వ్యవహరిస్తున్నారు.
కనుక రేపు ఆయనతో పాటు వైసీపి నేతలు, కార్యకర్తలు కూడా నష్టపోకుండా ఉంటారా?జగన్, వైసీపి నేతలు కలిసి రాష్ట్రంలో రాజకీయాలను ఈ స్థాయికి దిగజార్చేసినందున రేపు వారు కూడా ఈ నీచ రాజకీయాలకు మూల్యం చెల్లించకుండా తప్పించుకోగలరా?వారే చెప్పాలి.




