వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం అవడంతో బహుశః వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచర గణానికి ఆందోళన మొదలయ్యే ఉంటుంది. కానీ ఆమె రాకతో సంతోషించేవారు కూడా వైసీపిలోనే ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డితో వేగలేక తీవ్ర ఇబ్బందిపడుతూ సర్దుకుపోతున్న బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లకు ఇది గొప్ప శుభవార్తే అవుతుంది. కనుక ఆమె రాక కోసం వారందరూ బహుశః ఎదురుచూస్తూనే ఉండవచ్చు.
సొంత చెల్లెలిని రాజకీయంగా ఎదుర్కోవలసి రావడం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందే అని వేరే చెప్పక్కరలేదు. పైగా ఆమె టిడిపి, జనసేనలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దోస్తీ చేస్తే అది ఇంకా ఇబ్బంది. ఆమె వస్తూనే ముందుగా వైసీపిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించడం ఖాయమే.
వైఎస్ షర్మిల ఏపీకి వస్తే వైసీపి నేతలు, కార్యకర్తలు మళ్ళీ కాంగ్రెస్లోకి క్యూ కడతారని చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణగా ఇటీవల వైసీపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తాజా స్టేట్మెంట్ ఎదురుగానే ఉంది.
ఆయన ఏమన్నారంటే, “మంగళగిరిలో నేను నారా లోకేష్ని ఓడించినందుకు బహుమతిగా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కనీసం నా నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ఆశించాను. కానీ రూ.1,200 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం ఈ నాలుగేళ్ళలో కేవలం రూ.120 కోట్లే ఇచ్చారు. దీంతో నేను మరో రూ.8 కోట్లు అప్పు తెచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేశాను.
ఇంత చేసినా చివరికి నాకు పొగపెట్టి పంపించేశారు. నేను పార్టీకి, పదవికి ఎందుకు రాజినామా చేశానో జగన్కు కూడా తెలుసు. నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ వైఎస్ కుటుంబం వెంటే ఉంటాను. జగన్ నన్ను వదనుకొన్నారు కనుక నేను వైఎస్ షర్మిల వెంట నడుస్తాను.
తప్పు ఎవరు చేసినా తప్పే అని నేను భావిస్తాను. కనుక చంద్రబాబు నాయుడుపై కేసులు వేసి న్యాయపోరాటం చేసిన్నట్లే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు వేసి పోరాడేందుకు నేను సిద్దంగా ఉన్నాను,” అని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నారు.
ఇంతకాలం టిడిపి, జనసేనలు, లేదా వైసీపి నుంచి బయటకు వచ్చినవారు మాత్రమే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కానీ రేపు ఏపీ కాంగ్రెస్లో చేరబోయే వైసీపి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయవచ్చని అర్దమవుతోంది. కనుక జగన్మోహన్ రెడ్డికి ఇదీ ఇబ్బందే!
రాబోయే ఎన్నికల కోసం నాలుగున్నరేళ్ళుగా ఎంతో కష్టపడి అన్నీ ప్లాన్ చేసుకొంటే, హటాత్తుగా ఈ కొత్త సమస్యలు, కొత్త కష్టాలు ఏమిటో… కర్ణుడి శాపాల్లా!




