కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏ నాయకుడైనా ప్రజల మనసులు గెలుచుకోవాలనుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల అభిమానాన్ని, నమ్మకాన్ని త్వరగా సంపాదించుకోవడం రాజకీయంగా కూడా చాలా అవసరమే. అందుకే కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయగానే తొలి సంతకాలు అంటూ ప్రజాకర్షక పథకాలకు సంబంధించి ఫైళ్లపై సంతకాలు చేస్తుంటారు.
కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జోసెఫ్ విజయ్ కూడా అదే చేస్తున్నారిప్పుడు. ఇకపై రాష్ట్రంలో జన్మించే ప్రతి ఆడ, మగ శిశువుకు ‘మేనమామ తరఫున కానుకగా’ ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం రూ.755.83 కోట్లు కేటాయించబోతోంది.
అయితే జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత డీఎంకే ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని విమర్శించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా ప్రజలను ఆకట్టుకోవడానికి ఈ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించి దీని కోసం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. దీనిని సీఎం విజయ్ ఏవిధంగా సమర్థించుకోగలరు?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశమని, నిరుపేద మేనమామల తరఫున మేనల్లుడు లేదా మేనకోడలికి ప్రభుత్వమే బంగారు ఉంగరాలు అందించడం ద్వారా తమిళ సత్సాంప్రదాయాన్ని కాపాడటం కోసమని విజయ్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.
కానీ అదే నిధులతో ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలను మరింత మెరుగుపరచడం, పేద మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. లేదా వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను చేపట్టవచ్చు. కానీ యువకుడైన సీఎం విజయ్ అలాంటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయకుండా ఇటువంటి ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను మానుకోవాలని, లేకుంటే కనీసం తగ్గించుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా విదేశీ మారక నిల్వలు కరిగిపోకుండా కాపాడుకుంటూ, ప్రజా ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకుందామని సూచించారు.
కానీ యువకుడైన సీఎం విజయ్ ప్రధాని మోదీ పిలుపును పట్టించుకోకుండా ప్రభుత్వమే బంగారం ఆధారిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం విస్మయం కలిగిస్తుంది. సీఎం విజయ్ ప్రజల మనసులు గెలుచుకునేందుకు అనేక మంచి మార్గాలున్నాయి.
కానీ ఇటువంటి సంక్షేమ పథకాలతో ఆకట్టుకోవాలనుకోవడం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తోంది. ప్రజల జీవితాలను మార్చేందుకు ప్రయత్నించాల్సిన పాలకులు వారిని తమ ఓటు బ్యాంకులుగా మలుచుకునేందుకు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం చాలా బాధాకరం.




