తమ అభిమాన హీరోను చూసిన ఆనందంలో ఒక్కోసారి అభిమానులు విచక్షణ కోల్పోయి ప్రవరిస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ సంఘటన. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన దాసరి పార్థీవ దేహాన్ని, చివరిసారిగా తిలకించడానికి మెగా కాంపౌండ్ నుండి అల్లు అర్జున్ విచ్చేసారు. చిరంజీవి చైనాలో ఉండడంతో మెగా వర్గం తరపున బన్నీ విచ్చేసారు. దాసరి పార్థీవ దేహం చూసి, మీడియాతో మాట్లాడిన తర్వాత అంతిమ వీడ్కోలు ర్యాలీలో భాగంగా రెండడుగులు వేసారు అల్లు అర్జున్.
ఈ క్రమంలో అల్లు అర్జున్ ను చూసిన అభిమానులు… ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ… తమ మొబైల్స్ లో బంధించడానికి ఉత్సాహం ప్రదర్శించారు. ఒకరికొకరు పోటీలు పడుతూ మొబైల్స్ పట్టుకుని బన్నీ వెంటపడుతూ… “డీజే… డీజే… డీజే…” అంటూ నినాదాలు అందుకున్నారు. అయితే అభిమానుల ఉత్సాహంపై కాసేపటికి స్పందించిన అల్లు అర్జున్ ‘వద్దు బ్రదర్’ అనే భావన వచ్చే విధంగా అభిమానులను సముతాయించారు. ఈ సమయంలో అలాంటి నినాదాలు చేయడం, ఇలా ప్రవర్తించడం సరికాదని, తక్షణమే ఆపేయాలని వారికి సూచనలు చేసాడు బన్నీ.
దీంతో శాంతించిన అభిమాన వర్గం… సదరు డీజే నినాదాలను ఆపేయగా, మరికాసేపటికి బన్నీ కూడా కారెక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ బన్నీ ప్రదర్శించిన సమయస్ఫూర్తిని అభినందించాల్సిందే. వేదిక ఏదో అర్ధం చేసుకోకుండా మెగా అభిమానులు చూపిన అత్యుత్సాహాన్ని అడ్డుకోవడం స్ఫూర్తిదాయక విషయం. ఏ హీరో అభిమానులైనా సరే… ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఉంటే… వారికి సన్మార్గంలో పెట్టే బాధ్యత సదరు హీరో పైనే ఉంటుందని బన్నీ ఈ సందర్భంగా నిరూపించాడు. అయినా ఈ ఫ్యాన్స్ కు శవ వీడ్కోలుకు… సినిమా వేడుకకు తేడా తెలియదా అంటూ స్థానికంగా సామాన్యుల నుండి వినిపించిన మాటలు.



