సిట్యూయేషన్ మారిందేమో గానీ, సీన్ మారలేదు… లొకేషన్ షిఫ్ట్ అయ్యిందేమో గానీ, టెంప్టేషన్ ఆగలేదు… వెన్యూ చేంజ్ అయ్యిందేమో గానీ, వాయిస్ లో నో చేంజ్..! గత కొన్నాళ్లుగా పవన్ అభిమానులు – అల్లు అర్జున్ కు మధ్య జరుగుతున్న ‘వార్’ కధ ఇది. విజయవాడలో జరిగిన ‘సరైనోడు’ సక్సెస్ వేడుకలలో ప్రారంభమైన ఈ కధకు ఇప్పటికే ‘ఒక మనసు’ ఆడియో వేడుక ఒక సుదీర్ఘమైన సీక్వెల్ ఇచ్చింది. తాజాగా సింగపూర్ లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల ఫంక్షన్లో దీనికి మరో సీక్వెల్ ను అందించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘రుద్రమదేవి’ సినిమాలో ‘గోనగన్నారెడ్డి’ పాత్రకు గానూ విమర్శకుల నుండి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తర్వాత మైక్ పట్టుకున్న అల్లు అర్జున్ కు ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అనే పిలుపులు వినిపించాయి. దీంతో యధావిధిగా అసహనం వ్యక్తం చేసిన బన్నీ, ‘హే… గమ్మునుండవోయ్… మాట్లాడనీ…’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించినట్లుగా తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు మరోసారి భంగపాటుకు గురవ్వక తప్పలేదు. దీనిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద రచ్చకే దారి తీసింది.
ఇక్కడ విస్తుగోలిపే మరో అంశం ఏమిటంటే… ఇలా అరిచి గోల చేస్తోంది… కేవలం ఒకటి, రెండు గ్రూప్ లకు సంబంధించిన పవన్ అభిమానులు మాత్రమేనని, వారిని కట్టడి చేస్తే సరిపోతుందని, ‘ఒక మనసు’ ఆడియో వేడుకపై స్వయంగా అల్లు అర్జునే చెప్పారు. అదే నిజమైతే, మరి సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న వారు ఎవరు? హైదరాబాద్ వేడుకల్లో గోల చేసే అభిమానులే సింగపూర్ వెళ్లి మరీ ఆ విధంగా గోల చేయరు కదా! పవన్ అభిమానులపై బన్నీ వ్యక్తపరుస్తున్న అక్కసుతో బహుశా ఇతర పవర్ స్టార్ అభిమానులే ఇలా చేస్తున్నారని భావించాలి అంటున్నారు సినీ పరిశీలకులు.
అయితే ‘ఒక మనసు’ వేడుకపై సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్న తర్వాత… తనను అర్ధం చేసుకుంటారని భావించిన అల్లు అర్జున్ వ్యాఖ్యలు అర్ధరహితంగానే మిగిలిపోయాయా? అన్న మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే ఇంత రచ్చకు కారణమవుతున్న అల్లు అర్జున్ ప్రసంగపు వీడియోను బుల్లితెరపై ప్రసారం చేసేటపుడు ఎడిట్ చేస్తారా? లేక యధావిధిగా ఉన్నది ఉన్నట్లు ప్రసారం చేస్తారా? అన్న ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది. ఏది ఏమైనా బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ ఎపిసోడ్ ‘మంట’ ఇంకా ఆగలేదని సైమా అవార్డుల వేడుక మరోసారి నిరూపించిందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.



